చిద్దూ కుమారుడు కార్తితో ఖుష్బూ కయ్యం
చెన్నై: ప్రముఖ సినీ నటి, కాంగ్రెసు నాయకురాలు ఖుష్భూ, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తీపై కయ్యానికి దిగారు. ఇరువురి మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరుకుంది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న ఆధిపత్య పోరుతో విమర్శల జోరు రోజు రోజుకీ పెరిగిపోతోంది.
కాంగ్రెస్ పార్టీ సినీ నటులపై ఆధారపడి బతకడం లేదని కార్తీ తొలుత వివాదానికి తెర తీశారు. దీంతో, ఖుష్బు కార్తీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సినీ నటులపై ఆధారపడి లేదన్నారు గానీ చిదంబరం, కార్తీలు మాత్రం కాంగ్రెస్పైనే ఆధారపడి ఉన్నారని ఖుష్బూ సెటైర్ వేశారు.
దీనికి కార్తీ సమాధానమిస్తూ, ఖుష్బు పెద్ద నాయకురాలేం కాదని, పార్టీకున్న 60 మంది అధికార ప్రతినిధుల్లో ఖుష్బూ కూడా ఒకరని ఎద్దేవా చేశారు. వీరిద్దరి మధ్య జరుగుతున్న సమరానికి భరత వాక్యం పలికేందుకు పార్టీ అధ్యక్షుడు ఇళంగోవన్ రంగంలోకి దిగారు.
పార్టీ ప్రయోజనాల రీత్యా వీరిద్దరి మాటల యుద్ధానికి తెరపడేలా సమస్యల్ని పరిష్కరించేందుకు ఇళంగోవన్ చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.