5/20 నిబంధన: 'రతన్టాటా ఆదర్శంగా నిలవడం లేదు'
న్యూఢిల్లీ: భారత విమానయాన రంగంలో ప్రస్తుతం అమలులో ఉన్న 5/20 నిబంధనను తొలగించాలని టాటా గ్రూప్ సంస్ధల గౌరవ ఛైర్మన్ రతన్ టాటా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వివాదంగా మారింది. ఈ లేఖను విమానయాన సంస్ధలు తీవ్రంగా తప్పబడుతున్నాయి.
అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వయసులో ఉన్న రతన్ టాటా జాతి ప్రయోజనాలు పక్కనబెట్టి, స్వప్రయోజనాల దిశగా అడుగులు వేస్తున్నారంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ లైన్స్ ఆరోపించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ లైన్స్లో భాగంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ లు 5/20 నిబంధనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ నిబంధన ప్రకారం, కనీసం ఐదేళ్లపాటు 20 విమానాలతో సేవలందిస్తేనే, విదేశీ సర్వీసులు నడిపేందుకు అనుమతి లభిస్తుంది. ఈ నిబంధనను తొలగించాలని రతన్ టాటా కేంద్రానికి లేఖ రాయడంతో ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలు టాటాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
రతన్ టాటా జాతి ప్రయోజనాలు పక్కనపెట్టి, స్వప్రయోజనాల దిశగా అడుగులు వేస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ లైన్స్ ఆరోపించిన నేపథ్యంలో, టాటా గ్రూప్ కూడా ఎదురుదాడికి దిగింది. ప్రస్తుతం భారత విమాన రంగంలో ప్రభుత్వం తరుపున సేవలందిస్తున్న ఎయిర్ ఇండియా ఎవరిదో తెలుసా? అని ప్రశ్నించింది.
1932లోనే టాటా ఎయిర్ లైన్స్ ఇండియాలో సేవలందించిందని, దాన్ని ప్రారంభించిందే టాటాలని గుర్తు చేసిన టాటా గ్రూప్, ఆపై అదే ఎయిర్ ఇండియాగా రూపాంతరం చెందిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. భారత్కు విమానాలను తెచ్చిన టాటా గ్రూప్ను ప్రస్తుత ప్రైవేట్ సంస్థలు విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాటా గ్రూప్ ఎయిర్ ఆసియా, టాటా విస్తారాల పేరిట రెండు జాయింట్ వెంచర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.