అమ్మాయిల కాలేజీలో దారుణం: డ్రైనేజీలో శానిటరీ ప్యాడ్స్... ఎవరివో తేల్చేందుకు తనిఖీ చేసిన సిబ్బంది !
పంజాబ్ : పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. బటిండా అకాల్ యూనివర్శిటీలోని అమ్మాయిల హాస్టల్లోని విద్యార్థినులు ఒక్కసారిగా నిరసనలు తెలిపారు. అమ్మాయిలంతా ఒకేసారి నిరసనలు తెలపడం అదికాస్తా బయటకు పొక్కడంతో పలు విద్యార్థి సంఘాలు కూడా క్యాంపస్కు చేరుకుని ధర్నాకు దిగాయి.ఇంతకీ క్యాంపస్లో ఏంజరిగింది...? ఎందుకు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి...?
వాష్రూంలోలో వాడిపడేసిన శానిటరీ ప్యాడ్స్
పంజాబ్లోని అకాల్ యూనివర్శిటీలో దారుణం చోటుచేసుకుంది. అమ్మాయిల హాస్టల్లో ఉండే వాష్రూంలో శానిటరీ ప్యాడ్స్ కనిపించడంతో హాస్టల్ వార్డెన్కు ఎక్కడా లేని ఆగ్రహం వచ్చింది. దీంతో సెక్యూరిటీ గార్డులను పిలిపించి ఎవరు ఈ శానిటరీ ప్యాడ్స్ వినియోగించి వాష్రూంలో పడేశారో తేల్చాలని పురమాయించింది. దీంతో అమ్మాయిల గదులను ముందుగా చెక్ చేశారు. అనంతరం వారిని కూడా తనిఖీ చేశారు. పీరియడ్స్ ఎవరికి ఉన్నాయో తెలుసుకునేందుకు అమ్మాయిలను లైన్లో నిల్చోబెట్టి చెక్ చేశారు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనలు
విషయం క్యాంపస్ బయటకు పొక్కడంతో విద్యార్థి సంఘాలు యూనివర్శిటీకి చేరుకుని ఆందోళనలు చేశాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఇద్దరు సెక్యూరిటీ గార్డులను బాధ్యులైన ఇద్దరు హాస్టల్ వార్డన్లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రమంతా దావనంలా వ్యాపించింది. అమ్మాయిలూ చేయరాని నేరం అక్కడ ఏం చేశారని విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. యూనివర్శిటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
బట్టలు తీసేయమన్న కీచక టీచర్లు
ఇలాంటి ఘటనే గతేడాది నవంబర్లో ఇదే పంజాబ్లోని ఫజిల్కా జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థినులు శానిటరీ ప్యాడ్స్ ధరించారో లేదో తెలుసుకునేందుకు అక్కడి టీచర్లు విద్యార్థినులను బట్టలు తీసేయమన్నారు. అప్పట్లో ఈ ఘటనపై పెద్ద దుమారమే రేగింది. ఒక శానిటరీ ప్యాడ్ స్కూలు వాష్ రూంలో కనిపించడంతో ఎవరు ధరించలేదో చెక్ చేసేందుకు ఆ స్కూలు టీచర్లు ఇలాంటి నీచపు స్థాయికి దిగజారారు. విద్యార్థినులు ఏడుస్తూ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే స్పందించిన సీఎం ఇలా ప్రవర్తించిన టీచర్లపై వేటు వేశారు.