ఈసారి దక్షిణాదిలో మండిపోనున్న ఎండలు: కానీ, ఉత్తరాది కంటే తక్కువే
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. అయితే, ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఎండలు కాస్తంత తక్కువగానే ఉండనున్నాయని తెలిపింది. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఎండలు మండిపోనున్నాయని తెలిపింది.
హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోనూ ఎండలు ఎక్కువగానే ఉండనున్నాయని వెల్లడించింది. వచ్చే వేసవిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ నగర ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెరడ్డి తెలిపారు. 45 డిగ్రీల వరకు ఎండలు నమోదు కానున్నాయని తెలిపారు.
దేశంలోని 17 రాష్ట్రాల్లో సాధారణం కన్నా ఒక డిగ్రీ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 0.5 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.
కాగా, ఎల్నినో కారణంగా గతేడాది సరైన వర్షాలు కురవలేదు. కానీ ఈసారి లా నినా వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని ఐఎండీ స్పష్టంచేసింది. పసిఫిక్ మహాసముద్ర తూర్పు భూమధ్యరేఖ ప్రాంతంలో ఏర్పడే లా నినా పరిస్థితుల వల్ల మన దేశంలో వర్షాలు మెండుగా కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. లా నినా పరిస్థితులంటే.. తూర్పు భూమధ్యరేఖ ప్రాంత పసిఫిక్ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కచ్చితంగా వర్షాకాలం ఎలా ఉంటుందన్నది ఐఎండీ చెప్పకపోయినా.. ఈ పరిస్థితులు మాత్రం మంచి పరిణామమేనని స్పష్టంచేసింది.
నిజానికి జూన్ తర్వాత లా నినా పరిస్థితుల బలహీన పడతాయని గత జనవరిలో ఐఎండీ అంచనా వేసినా.. ఇప్పుడు వాటిని సవరించింది. గతేడాది ఊహించినదానికంటే రెండు రోజుల ముందూ రుతు పవనాలు వచ్చినా.. ఎల్ నినో పరిస్థితుల కారణంగా సరైన వర్షాలు కురవలేదు. అయితే ఈ ఏడాది ఎండాకాలం మాత్రం మాడు పగలగొట్టడం ఖాయమని వాతావరణ శాఖ తెలిపింది.