నోట్ల రద్దుపై మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించా, పట్టించుకోలేదు: రఘురాం రాజన్
న్యూఢిల్లీ: నల్లధనం అణచివేసేందుకు గాను పెద్ద నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం కన్నా... తాత్కాలిక నష్టమే ఎక్కువ జరుగుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని తాను ముందే హెచ్చరించానని ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు.
నల్లధనం అరికట్టేందుకుగాను మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసే విషయమై తాను ఆర్బిఐ గవర్నర్గా ఉన్న విషయంలో సంప్రదించిందని రఘురామ్ రాజన్ చెరప్పారు.
అయితే పెద్ద నోట్ల రద్దు విషయంలో తాను ముందే హెచ్చరించినట్టు చెప్పారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు ఇతర ప్రత్యామ్నాయాలను తాను ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. అయినా ప్రభుత్వం తన సూచనలను పట్టించుకోలేదని చెప్పారు.
ఐ డూ వాట్ ఐ డూ రిఫార్మ్స్ , రెటారిక్, రిజాల్వ్ పేరిట రాజన్ రాసిన పుస్తకం వచ్చే వారంలో విడుదల కానుంది. 2016 ఫిబ్రవరిలో పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తన అభిప్రాయాన్ని మౌఖికంగా కోరిన విషయాన్ని రఘురాం రాజన్ ప్రకటించారు.
పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడే సమస్యలు, అనువైన సమయం,ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్బిఐ ఒక నివేదికను కేంద్రానికి సమర్పించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గత ఏడాది సెప్టెంబర్ 5వ, తేదిన రఘురాం రాజన్ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయన షికాగో యూనివర్శిటీ బిజినెస్ స్కూల్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.