అంతా వారే చేశారు: జూనియర్, సీనియర్ పవార్లపై దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ నేత అజిత్ పవార్ను బీజేపీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
అజిత్ పవారే..
ఓ మీడియా ఛానల్తో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. తనకు 54 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందంటూ అజిత్ పవారే తమని సంప్రదించారని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. తాము ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయాలని ప్రయత్నించలేదని, ఏ పార్టీని చీల్చలేదని స్పస్టం చేశారు.
శరద్ పవార్కు తెలుసంటూ..
నవంబర్ 23న ప్రమాణస్వీకారానికి కొన్ని రోజుల ముందు అజిత్ పవార్ తమ దగ్గరకు వచ్చారని.. బీజేపీతో కలిసి నడవడానికి ఎన్సీపీ సిద్ధంగా ఉందని చెప్పారని తెలిపారు.
అంతేగాక, కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడించారని తెలిపారు. శరద్ పవార్కి కూడా ఈ విషయం తెలుసన్నారని వివరించారు.
శరద్ పవార్ కీలక విషయాలు దాచారు..
ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో శరద్ పవార్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో ప్రధాని నరేంద్ర మోడీ తనను బీజేపీతో కలిసి పనిచేయాలని కోరారని శరద్ పవార్ చెప్పారు. కానీ, ప్రధాని ఆఫర్ను తాను తిరస్కరించినట్లు పవార్ తెలిపారు. ఈ విషయంపైనా ఫడ్నవీస్ స్పందిస్తూ.. శరద్ పవార్ కేవలం తనకు అనుకూలమైన అంశాల్నే బహిర్గతం చేశారని ఆరోపించారు. ఇంకా అనేక అంశాల్ని దాచి ఉంచారన్నారు. సరైన సమయంలో వాటన్నింటినీ ప్రజల ముందుకు తెస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ వివరించారు.
నాటకీయ పరిణామాల మధ్య ఉద్ధవ్ థాక్రే సీఎం..
కాగా, మహారాష్ట్రలో అజిత్ పవార్ మద్దతిస్తాననడంతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. కేవలం 80 గంటలపాటే ఆయన సీఎం పదవిలో కొనసాగడం గమనార్హం. అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.