బాగా క్లోజ్: కేరళ సీఎం చాందీకి సరిత మరో షాక్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోందా? సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరితా ఎస్ నాయర్ తనను కేవలం రెండు మూడు సార్లు మాత్రమే కలిసిందని సీఎం చాందీ చెబుతున్న మాటల్లో నిజం లేద ని సరితా చెప్పుకొచ్చింది.
శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను చాందీ కుటుంబానికి గానీ అతనికి గానీ కొత్త కాదని పేర్కొన్నారు. చాందీ ఇంట్లోకి ఏ సమయంలోనైనా వెళ్లేంత స్వేచ్ఛ తనకు ఉందని చెప్పారు. అంతేకాదు కిచెన్లోకి వెళ్లగలిగేంత స్వేచ్ఛ తనకు ఉందని, చాందీ కుటుంబం తనకు అంత దగ్గర అని ఆమె తెలిపారు.
చాందీ కుటుంబంతో తనకున్న సన్నిహతాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. 2011లో తాను జైలు నుంచి విడుదలైన తర్వాత తిరువనంతపురంలోని ఎడపాంజీ సమీపంలో తనకు ఓ ఇల్లు ఉందని, ఆ ఇల్లు సీఎం బంగ్లాకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండేదని పేర్కొంది.
చాందీ భార్య మరియమ్మ చాందీ జబ్బు బారిన పడినప్పుడు తాను రెగ్యులర్గా వెళ్లి చూసేదానిని అని ఆమె చెప్పుకొచ్చారు. ఆమెకు నర్సుగా కూడా కొంత కాలం పాటు ఉన్నానని, అయితే పని ఎక్కువగా ఉండటం వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితిపై దృష్టి పెట్టలేకపోయానని అన్నారు.
ముఖ్యమంత్రి బంగ్లాలోకి తాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్లేదానిని అని, నాకు ఎలాంటి గేట్ పాస్ కూడా అవసరం లేదని తెలిపారు. నా పేరు 'లక్ష్మీ' గా సెక్యూరిటీ సిబ్బంది అందరికీ తెలుసునని, చాలా సందర్భాల్లో సీఎం బంగ్లాలో తాను భోజనం చేశానని చెప్పారు.
సీఎం కావడంతో ఎక్కువ మంది సందర్శకులు వస్తూ పోతా ఉంటారని, నేనెప్పుడూ కూడా చాందీ కుటుంబం అంతా కలిసి భోజనం చేయడం చూడలేదన్నారు. అయితే సీఎం చాందీ మాత్రం సరితా నాయర్ మాటలను కొట్టి పారేశారు. తనకు లక్ష్మీ అనే వారు ఎవరూ తెలియరని, మీడియా అనవసరంగా ఆమెకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు.
మరోవైపు కేరళ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ఆయన రాజీనామా చేయాలంటూ విపక్షాల నుంచి పెద్ద ఎత్తున సభలో ఆందోళన చేపట్టాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్ పీ సదాశివం ప్రసంగిస్తుండగా.. ఎల్డీఎఫ్ మాటిమాటికీ అడ్డుపడింది.
సోలార్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం చాందీ, మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. వారి వ్యవహారంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మౌనంగా కూర్చోండి.. లేదంటే సభను వీడి వెళ్లిపోండి అని గట్టిగా హెచ్చరించారు. కేరళ అసెంబ్లీ చరిత్రలో సభ్యులకు గవర్నర్ చీవాట్లు పెట్టడం ఇదే తొలిసారి.
2013లో టీమ్ సోలార్ అనే కంపెనీ తక్కువ ధరలకు సోలార్ ప్యానల్స్ ఇస్తామని కేరళలో ప్రచారం నిర్వహించింది. ఈ కంపనీ యజమానులే సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్. అయితే వీరిద్దరూ దంపతులు కావడం విశేషం. సీఎం కార్యాలయ సిబ్బంది ఇతర మంత్రుల కార్యదర్శుల అండదండలతో భారీ ఎత్తున ప్రజల నుంచి నిధులు సేకరించారు.
ఆ తర్వాత సోలార్ ప్యానల్స్ అమర్చారు. ఈ సోలార్ ప్యానల్స్ అమరికపై ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్లతో పాటు సీఎం వద్ద కార్యదర్శిగా పనిచేసిన టెన్నీజొప్పన్, సినీ నటి షాలు మేనన్లను పోలీసులు అరెస్టుచేశారు.
ఆ తర్వాత ఈ సోలార్ కుంభకోణంపై న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో 2013 నుంచి జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు సరితా నాయర్ జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు బుధవారం విచారణకు హాజరై తాను సీఎం చాందీ సన్నిహితుడికి రూ. 1.90 కోట్లు, విద్యుత్ శాఖ మంత్రికి రూ. 40 లక్షలు లంచం ఇచ్చినట్లు వాంగ్మూలమిచ్చారు.