దళితుడిని కాబట్టే మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు: పరమేశ్వర
కర్నాటకలో రాజకీయాలు రోజుకో మలుపుతీసుకుంటున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలోని నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. అదే సమయంలో పార్టీలపై కూడా బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు. తాజాగా కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి పరమేశ్వర వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి తనకు దూరమైందని తను దళిత సామాజిక వర్గానికి చెందిన వాడిని కావడంతోనే ఆ పదవి తనకు దక్కలేదని వ్యాఖ్యానించారు. దళితులకు అండగా ఉండే పార్టీగా పేరుపడ్డ కాంగ్రెస్ పార్టీ... పరమేశ్వర వ్యాఖ్యలతో డిఫెన్స్లోకి పడిపోయింది. అయితే పరమేశ్వర ఏ నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలు చేశారో అనే దానిపై తనకు స్పష్టత లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య.
పీకే బసవలింగప్ప, కేహెచ్ రంగనాథ్లు కూడా ముఖ్యమంత్రి పదవి వరించినట్లే వరించి ఆ తర్వాత చేజారపోయిందని పరమేశ్వర చెప్పారు. ప్రస్తుత లోక్సభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కూడా సీఎం కాలేకపోయారని పరమేశ్వర చెప్పారు. ఇక తన వంతు వచ్చేసరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మూడుసార్లు వచ్చినప్పటికీ తనను వరించలేదని ఇందుకు కారణం తను దళితుడిని కావడమే అని పరమేశ్వర దేవనగెరిలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలోని కొందరు దళిత అధికారులను చిన్న చూపు చూడటం జరుగుతోందని చెప్పిన పరమేశ్వర... రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో మాత్రం దళితులకు అన్యాయం జరుగుతోందని అన్నారు.
చాలవాడి సామాజిక వర్గంను ఉద్దేశించి ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ పరమేశ్వర ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలవాడి సామాజిక వర్గం ఎస్సీ వర్గం కిందకు వస్తుంది. బెలగావి, హుబ్బాళి, ధార్వాడ్, విజయ్ పురా ,బీదర్ జిల్లాల్లో చాలవాడి సామాజిక వర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. ఇక పరమేశ్వర స్టేట్మెంట్స్తో అధికార పక్షం ఖంగు తినింది. దళితులకు ఇతర బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటోంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అయితే ఈ వ్యాఖ్యలు తాను ఎలా చేశాడో ఎందుకు చేశాడో తనకు తెలియదని అన్నారు సిద్ధ రామయ్య.