ఈ రోజు కోసం, ఈ క్షణం కోసమే ఇన్నాళ్లూ ఎదురు చూశా: సుష్మా స్వరాజ్ చిట్టచివరి సందేశం!
న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ స్టాల్ వార్ట్, ఉక్కు మహిళగా పేరున్న విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చిట్టచివరి సందేశం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కన్నుమూయడానికి సరిగ్గా మూడు గంటల ముందు సుష్మా స్వరాజ్ ఓ ట్వీట్ చేశారు. ఈ రోజు కోసం, ఈ క్షణం కోసం తాను ఇన్నేళ్లు ఎదురు చూశాను.. అనేది ఆ ట్వీట్ సారాంశం. మంగళవారం సాయంత్రం 7:23 నిమిషాలకు ఆమె ఈ ట్వీట్ ను తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ను పోస్ట్ చేసిన మూడు గంటల వ్యవధిలో కన్నుమూశారు. ఇది కేవలం యాదృశ్చికమే కావచ్చు.
థ్యాంక్యూ ప్రైమ్ మినిస్టర్ అంటూ
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే. తొలుత రాజ్యసభ, ఆ మరుసటి రోజు లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. మంగళవారంలోక్ సభలో సమగ్ర చర్చ ముగించుకుని ఈ బిల్లు లోక్ సభ ఆమోదం పొందేటప్పటికి.. సాయంత్రం 7 గంటలైంది. ఈ బిల్లును సభ ఆమోదించిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే సుష్మా స్వరాజ్ ఓ ట్వీట్ చేశారు. థ్యాంక్యూ ప్రైమ్ మినిస్టర్, థ్యాంక్యూ వెరీమచ్.. అంటూ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ ట్వీట్ ను ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ట్వీట్ చేశారు. ఈ రోజు కోసమే నా జీవితకాలం అంతా ఎదురు చూశాను. అని వ్యాఖ్యానించారు.
प्रधान मंत्री जी - आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji - Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019
చికిత్స పొందుతూ.. కన్నుమూత
ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురయ్యారు. తీవ్రమైన గుండెపోటు అది. తన సొంత నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిన సుష్మా స్వరాజ్ ను కుటుంబ సభ్యులు ఆమెను ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. చికిత్స చేస్తోన్న సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు కేంద్ర మంత్రులు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆమె మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు.