నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా.. మంచే జరిగింది: కరోనాపై శివరాజ్ సింగ్ చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తన బట్టలను తానే ఉతుక్కుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రి నుంచే ఆయన దేశంలో తొలిసారి విర్చువల్ కేబినెట్ సమావేశం నిర్వహించారు.
కరోనా పరీక్షల్లో ఏపీనే టాప్, కేసులు తగ్గించడం లేదు: భయపడొద్దంటూ సీఎం జగన్ పిలుపు
'కరోనా సోకిన వ్యక్తులు తమ బట్టలను ఇతరులకు ఉతకడం కోసం వేయరాదు. అందుకే నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా. అలా చేయడం నాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. గతంలో నా చెయ్యికి శస్త్రచికిత్స జరిగింది. ఎన్నోసార్లు ఫిజియోథెరపీ చేయించుకున్నాను. అయినా, పిడికిలి బిగించడానికి ఇబ్బందిగా ఉండేది. కానీ, ఇప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కుంటుండటంతో ఆ సమస్య తొలగిపోయింది. ఇలాంటి చిన్న చిన్న పనులు మనమే చేసుకుంటే బాగుంటుంది' అని శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించేందుకు చౌహాన్ వరుసగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం మంత్రులతో మాట్లాడారు. మంగళవారం ఉన్నతాధికారులతో పరిస్థితి సమీక్షించారు.
@ChouhanShivraj washing my clothes because #COVID19 patients can't give their clothes for washing.I had a surgery on my hand. Even after several physiotherapy sessions, I wasn't able to clench my fist. Now I am able to do so @ndtv @ndtvindia #coronavirus #COVID19UPDATE pic.twitter.com/5EbkljGjEG
— Anurag Dwary (@Anurag_Dwary) July 28, 2020
మరోవైపు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చిరయు మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి వెల్లడించింది. స్వల్పస్థాయిలో దగ్గు మినహా ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది. కరోనా సోకిన విషయాన్ని స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గత శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. శివరాజ్ భార్యాపిల్లలకు మాత్రం నెగిటివ్ వచ్చింది.
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 28,589 కరోనా కేసులు నమోదు కాగా, 7,978 యాక్టివ్ కేసులున్నాయి. 19,791 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 820 కరోనా బారినపడి మృతి చెందారు.