ఎన్కౌంటర్ టైంలో పనిచేయని తుపాకీ: ఎస్సై చేసిన పనికి ఉగ్రవాదులు పరార్, నెటిజన్లు ఫిదా
లక్నో: ఇటీవల ఉత్తర ప్రదేశ్లో ఓ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ సమయంలో ఓ పోలీసు అధికారి తుపాకీ పని చేయలేదు. దీంతో అతనికి ఏం చేయాలో తోచలేదు. దానిని పరిశీలిస్తూ ఉండిపోయాడు. ఆ పక్కనే ఉన్న మరో పోలీసు అధికారికి ఓ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆ పని చేశారు.
నెటిజన్లు ఫిదా
ఎంతో తెలివితో, సమయస్ఫూర్తితో చేసిన ఆ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకు అతను ఏం చేశాడంటే.. ఓ వైపు సహచర పోలీసు తుపాకీ పని చేయక ఆందోళన చెందుతుంటే తుపాకిని పేల్చుతున్నట్లుగా మిమిక్రీ చేశాడు. అంతేకాదు, థైన్.. థైన్ అంటూ విచిత్రంగా కేకలు వేశాడు.
తుపాకీ పని చేయలేదు
యూపీలోని సంభాల్ ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. ఉగ్రవాదులు రాత్రి వేళల్లో చొరబడి దాడులు చేయడంతో సంభాల్ ఎస్పీ యమునా ప్రసాద్ వారిపై కాల్పులు జరిపారు. ఇంతలో తుపాకీ పని చేయలేదు. దానిని పరిశీలిస్తూ ఉండిపోయారు. ఇంతలో సంభాల్ ఎస్సైగా పనిచేస్తున్న మనోజ్ కుమార్ ఉగ్రవాదులకు కన్పించకుండా యమునా ప్రసాద్ నిలబడిన చోటికి వెళ్లి విచిత్రంగా కేకలు వేశారు.
పారిపోయిన ఉగ్రవాదులు
దాంతో ఉగ్రవాదులు భయపడి పారిపోయారు. ఆ పోలీసు అలా విచిత్ర శబ్దాలు చేస్తున్నప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని తెలివికి, సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అయ్యారు. మనోజ్ను సత్కరించాలని, అతనికి అవార్డు ఇవ్వాలని సహోద్యోగులు కోరారు.
సన్నానం చేయాలని సంభాల్ ఎస్పీ
మనోజ్ కుమార్ని అందరూ హీరో అంటున్నారని, ఆ సమయంలో తన చేతిలో ఉన్న తుపాకీ పనిచేయకపోయినప్పటికీ మనోజ్ భయపడలేదని, ధైర్యంగా ఉగ్రమూకలను తిప్పికొట్టారని, విచిత్రమైన అరుపులతో తోటి ఉద్యోగులను ప్రోత్సహించారని, మారో, ఘెరావ్ అనే మాటలు ఉగ్రవాదులను ఒత్తిడికి గురి చేస్తాయని, ఇందుకు మనోజ్ కుమార్ను సత్కరించాల్సిందేనని సంభాల్ ఎస్పీ యమునా ప్రసాద్ అన్నారు.