కాశ్మీర్ అంశాన్ని పరిశీలిస్తున్నాం, పాక్కి సానుకూలంగానే.: చైనా
న్యూఢిల్లీ: రెండ్రోజులపాటు భారత పర్యటనకు రానున్న చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కాశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న పరిమాణాలను పరిశీలిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తెలిపారు. పాకిస్థాన్కు చెందిన ప్రధాన అంశాల వరకు ఆ దేశానికి మద్దతిస్తామని చెప్పారు.
ఈ మేరకు ఆ దేశ అధికార న్యూస్ ఏజెన్సీ జిన్హువా వెల్లడించింది. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది స్పష్టంగా తెలుస్తోందని పాక్ ప్రధానితో జిన్పింగ్ అన్నట్లు తెలిపింది. అదే సమయంలో కాశ్మీర్ అంశాన్ని ఇరుదేశాలు శాంతియుతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని జిన్పింగ్ సూచించినట్లు పేర్కొంది.
బీజింగ్లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కలిసిన తర్వాత జీ జిన్పింగ్ కాశ్మీర్ పై తన అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అవసరమైన మేరకు పాకిస్థాన్ కు మద్దతు ఇవ్వనున్నట్లు జిన్పింగ్ తెలిపారు.
పాకిస్థాన్ స్వాతంత్ర్య సార్వభౌమత్వాన్ని, ప్రాదేశికతను కాపాడుతానని చైనా ప్రధాని లీ కెకియాంగ్ తెలిపినట్లు సమాచారం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా, అక్టోబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులోని చారిత్రాత్మక నగరం మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో జిన్పింగ్ భేటీ కానున్నారు.
కాగా, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, సంయుక్త అధికారిక ప్రకటనలు ఉండవని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేవలం ఉభయ దేశాల మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగానే ఈ భేటీ జరుగుతోందని పేర్కొన్నాయి.
ప్రధాని మోడీతో చెన్నై సమీపంలోని మహాబలిపురంలో సమావేశమవుతారు. అంతేగాక, ఈ భేటీక ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని ప్రకటించారు అధికారులు. కేవలం సరిహద్దుల్లో శాంతిని పెంపొందించడంపైనే చర్చిస్తారని తెలిపారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు.