కిరణ్ బేడీ ట్వీట్తో భగ్గుమన్న తమిళ రాజకీయ పార్టీలు.. బేడీ ట్వీట్లో ఏముంది..?
చెన్నై: తమిళనాడు నీటికష్టాలు రాజకీయ రంగు పులుముకుంది. తమిళనాడులో నీటి కొరతకు కారణం అక్కడి అవినీతి రాజకీయాలే అంటే పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. దీనిపై అక్కడి రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కిరణ్ బేడీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. "ఓ ప్రశ్నకు సరైన సమాధానం ఉంది. భారతదేశంలో ఆరో అతిపెద్ద నగరమైన చెన్నై నగరం నీటి కష్టాలు ఎదుర్కొంటున్న తొలి నగరంగా నిలిచింది. ఇదే చెన్నై నగరం నాలుగేళ్ల క్రితం వరదల్లో మునిగిపోయింది. సమస్య ఎక్కడుంది..? దీనికి సమాధానం ప్రభుత్వ వైఫల్యం, అవినీతి రాజకీయాలు, భిన్నమైన బ్యూరోక్రసీ" అని కిరణ్ బేడీ ట్వీట్ చేయడంతో రాజకీయ పార్టీలు మండిపడ్డాయి.
కిరణ్ బేడీ వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్
అసెంబ్లీలో నీటి సమస్యపై మాట్లాడేందుకు ప్రతిపక్షనేత స్టాలిన్కు స్పీకర్ ధనపాల్ అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన అసెంబ్లీ నుంచి వాక్ఔట్ చేశారు. అంతేకాదు కిరణ్ బేడీ వ్యాఖ్యలపై కూడా తాను మాట్లాడాలని భావించిన నేపథ్యంలో అందుకు అసెంబ్లీ నిబంధనలు ఒప్పుకోవని స్పీకర్ చెప్పారు. గవర్నర్ గురించి అసెంబ్లీలో మాట్లాడరాదని చెప్పారు.అంతేకాదు కిరణ్ బేడీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డీఎంకే డిమాండ్ చేసింది. వెంటనే కిరణ్ బేడీని గవర్నర్గా తొలగించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను డిమాండ్ చేశారు. గవర్నర్ పదవిని మాత్రమే గౌరవిస్తామని అయితే వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు స్టాలిన్. తమిళనాడు ప్రజలు ప్రేమతో గౌరవంతో వ్యవహరిస్తారని స్టాలిన్ గుర్తు చేశారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను హేళన చేయరాదు
రాజకీయ పార్టీలనుద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేసి ఉంటే పట్టించుకోము కానీ... ప్రజల గురించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం గురించి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించబోమని స్టాలిన్ చెప్పారు. గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి తమిళనాడు ప్రజలను అవమానించారని ధ్వజమెత్తారు. ఆమె వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని అందుకే నిరసనగా వాకౌట్ చేసినట్లు స్టాలిన్ తెలిపారు. కిరణ్ బేడీ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతుండటంతో ఆమె స్పందించారు. తను ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని కిరణ్ బేడీ చెప్పారు. తన ట్వీట్ వ్యక్తిగతం కాదని చెప్పారు.
వాస్తవాలను మరిచి కిరణ్ బేడీ వ్యాఖ్యలు చేశారు: అన్నాడీఎంకే
ఇదిలా ఉంటే అధికారిక అన్నాడీఎంకే పార్టీ కూడా బేడీ వ్యాఖ్యలపై మండిపడింది. భారత్లోని సగం జిల్లాల్లో నీటికొరత ఉందని కేంద్రమే ఓ ప్రకటనలో తెలిపిందని గుర్తుచేసింది. 2017లో పోలిస్తే గతేడాది 67శాతం తక్కువగా చెన్నైలో వర్షపాతం నమోదైందని వెల్లడించింది. పుదుచ్చేరీ గవర్నర్ కొన్ని వాస్తవాలను విస్మరించి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం అని చెప్పారు. ఆమె తన బాధ్యతల వరకు పరిమితం కావాలని కావేరీ నుంచి తమిళనాడుకు పుదుచ్చేరికి న్యాయపరంగా రావాల్సిన నీటివాటాపై పోరాడాలని అన్నాడీఎంకే వెల్లడించింది. ఇదిలా ఉంటే కేంద్రం కిరణ్ బేడీపై చర్యలు తీసుకోవాలని కోరుతామని పుదుచ్చేరీ అన్నాడీఎంకే పార్టీ స్పష్టం చేసింది. ఇక రెండు పార్టీలు కిరణ్ బేడీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం నిరసనలు చేపడుతామని చెప్పాయి.