వాటర్ వార్: చెన్నైలో నీటి ఎద్దడి తీవ్రతరం...నీళ్లకోసం గొడవల్లో ఒకరు మృతి
చెన్నై: తమిళనాడులో నీటికష్టాలు ప్రారంభమయ్యాయి. బిందెడు నీళ్లు దొరకడం చాలా కష్టంగా మారింది. నీటి కోసం ప్రజలు ఏకంగా ప్రాణాలు తీసుకునేవరకు వెళుతున్నారు. గత వారంలో నీళ్ల కోసం పడిన గొడవలో తమిళనాడు స్పీకర్ ధనపాల్ డ్రైవర్ రామకృష్ణన్ నీళ్ల కోసం గొడవపడుతూ తన పొరుగింట్లో నివసించే ఓ మహిళపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం కుదుటపడుతోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతోంది.
ఎండిపోయిన రిజర్వాయర్లు
వర్షాలు తక్కువగా పడుతాయనే సంకేతాలు రావడం, రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లు ఎండిపోవడంతో నీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో రాజధాని చెన్నై నగరంలో ఐటీ కంపెనీలు, ఇతర రెస్టారెంట్లు మూసివేశారు.వారి ఆపరేషన్స్ను నిలిపివేశారు.ఇక నీళ్ల ట్యాంకర్ల కోసం అధిక డిమాండ్ ఏర్పడింది. ఇక నీళ్ల కోసం అక్రమ మార్గాలు వెతుక్కుంటుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నీటి కనెక్షన్లను కట్ చేసింది. ఇక నీటి కష్టాలు ఒక్క చెన్నై నగరానికే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నీటికోసం ఏకంగా యుద్ధాలే జరుగుతున్నాయి.
సామాజిక కార్యకర్త ఆనంద్ బాబును కొట్టి చంపిన పొరిగింటివారు
ఒక ట్యాంకరు వస్తే చాలు నీళ్ల కోసం పెద్ద క్యూలలో ప్రజలు నిలబడుతున్నారు. ఇక నీళ్లు దొరక్కపోవడం గంటలకొలదీ నీటికోసం క్యూలో నిలబడి సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. తంజావూరులో నీటిని అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారని జలదోపిడీకి పాల్పడుతున్నారని పొరుగింటివారిని సామాజిక కార్యకర్త ఆనంద్ బాబు అనే వ్యక్తి ప్రశ్నించినందుకు ఆయన్ను కొట్టి చంపారు. ఆనంద్ బాబును కొట్టి చంపిన వ్యక్తి కుమార్గా పోలీసులు గుర్తించారు. కుమార్ అక్రమంగా ట్యాంకుపైకి ఎక్కి నీటిని తోడుకుంటుండటంతో ఆనంద్ బాబు ప్రశ్నించారని అడ్డుకున్నాడని దీంతో ఆయన్ను కుమార్ కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. కుమార్తో పాటు అతని ఇద్దరు కుమారులు కూడా ఆనంద్ బాబుపై దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు.
మున్సిపల్ శాఖ మంత్రి రాజీనామాకు స్టాలిన్ డిమాండ్
ఇక నీటి ఎద్దడి తీవ్రతరం అవుతుండటం ప్రజలు కష్టాలు పడుతుండటంతో ప్రతిపక్షనేత స్టాలిన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు అవినీతి చేసేందుకే సమయం సరిపోతోందని ప్రజల ఇబ్బందులు పట్టించుకునేంత సమయం లేకుండా పోతోందని స్టాలిన్ ఎద్దేవా చేశారు. మరోవైపు అన్నాడీఎంకే ప్రభుత్వం నీటిసమస్యను పరిష్కరించేందుకు చర్యలకు ఉపక్రమించింది.ఇక నీటిఎద్దడి దక్షిణభారత రైల్వేల్లో కూడా కనిపిస్తోంది. ఇతర చోట్ల నుంచి చెన్నైకు నీటిని ట్యాంకుల్లో తరలిస్తోంది.