పాకిస్తాన్కు మరో షాక్, నీటి విడుదలను ఆపేస్తాం, అవేం చేస్తామంటే..: గడ్కరీ హెచ్చరిక
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్తాన్ను సాధ్యమైనంత మేర కార్నర్ చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాక్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాన్ని 200 శాతానికి పెంచింది. పలు ప్రయివేటు కంపెనీలు పాక్లో తమ సేవలు నిలిపివేశాయి. చాలామంది రైతులు కూడా పాక్కు కూరగాయలు వంటి వాటిని పంపించడం ఆపేశారు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను భారత్ రద్దు చేసింది. తాజాగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాకిస్తాన్కు మరో హెచ్చరిక జారీ చేశారు.
పుల్వామా దాడి, యుద్ధమంటూ వాగ్భాణాలు: భారత్-పాక్ బలాబలాలివే, ఎవరివద్ద ఎన్ని?
పాక్కు నీటి విడుదల ఆపేస్తాం
పాకిస్తాన్కు విడుదల చేస్తున్న నీటి విడుదలను ఆపేస్తామని గడ్కరీ గురువారం హెచ్చరించారు. అవసరమైతే పాక్కు వెళ్లే నీటిని యమునకు తరలిస్తామని చెప్పారు. భారత్ మీదుగా పాక్కు మూడు నదుల ద్వారా నీరు వెళ్తుందని, వాటిని ఆపేసి అవసరమైతే యమునా నదికి తరలిస్తామని చెప్పారు. భారత్ చాలాకాలంగా ఈ నదుల నీటిని పాక్కు ఇస్తోందని, ఇప్పుడు మనం ఉపయోగించుకునే పరిస్థితులు వచ్చాయని చెప్పారు.
ఇండస్ వాటర్ ఒప్పందం ప్రకారం
ఇండస్ వాటర్ ఒప్పందం ప్రకారం రావి, సట్లేజ్, బియాస్ నదుల నీటిని మన దేశం పాకిస్తాన్కు ఇస్తోంది. దీంతో పాటు జీలం, చినాబ్, ఇండస్ నదుల నీటిని కూడా ఉపయోగించుకునేందుకు అవకాశమిస్తోంది. కానీ పాకిస్తాన్ మన దేశం పైకి ఉగ్రవాదులను పురిగొల్పుతున్న నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సీరియస్గా ఉంది. గతంలో 2016లో యూరి దాడి జరిగినప్పుడు పాకిస్తాన్కు నీటిని ఇవ్వకుండా మన నీటిని మనమే ఉపయోగించుకునేందుకు భారత్ చర్యలు ప్రారంభిస్తామని చెప్పింది. ఈ మేరకు త్వరితగతిన నీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పింది.
యమునా నదిని కాపాడేందుకు
ఈ సందర్భంగా తాజాగా, గడ్కరీ మాట్లాడుతూ.. యమునా నదిని కాపాడేందుకు పలు ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు చెప్పారు. సహజ యమునా నదిని కాపాడేందుకు పలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ఆ నీటి ద్వారా యమునను కాపాడుతామని చెప్పారు. పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ పైన తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే.