భూగోళం 2.0: ఆ గ్రహంపై ఓ సముద్రమే ఉండొచ్చంటోన్న శాస్త్రవేత్తలు: గ్రహాంతరవాసులకు ఛాన్స్
న్యూయార్క్: అనంత విశ్వంలో గ్రహాంతరవాసుల జాడ కోసం దశాబ్దాల తరబడి కొనసాగుతున్న అన్వేషణ ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. నాలుగేళ్ల కిందటే కనుగొన్న కే2-18బీ గ్రహంపై గ్రహాంతరవాసులు జీవించడానికి అవకాశం ఉన్నట్లుగా నిర్దారించారు. అంతరిక్ష పరిశోధకులు. ఆ గ్రహంపై నీరు ద్రవరూపంలో ఉందనే విషయాన్ని తాజాగా వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంపై నేచర్ అస్ట్రానమీ జర్నల్ ఓ వ్యాసాన్ని ప్రచురించారు. పాలపుంతకు అవతల 111 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహంపై, భూమిని పోలిన వాతావరణం ఉందని ధృవీకరించారు. ఓ మర్రుగుజ్జు నక్షత్రం చుట్టూ ఆ గ్రహం పరిభ్రమిస్తోందని తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా 2015లో ఈ గ్రహాన్ని గుర్తించారు. అప్పటి నుంచీ దీనిపై పరిశోధనలు కొనసాగించారు.
4000 గ్రహాలు కనుగొన్నా..
కే2-18బీ గ్రహ వాతావరణంలో నీటి పొరలు, మంచు తెరలు పెద్ద ఎత్తున ఉన్నట్లు తేలింది. నీరు ద్రవరూపంలో ఉన్నప్పుడే వాతావరణంలో నీటి పొరలు ఏర్పడే అవకాశం ఉంటుందని తేల్చారు. ఇప్పటిదాకా ఖగోళ శాస్త్రవేత్తలు సుమారు నాలుగు వేలకు పైగా సరికొత్త గ్రహాలను గుర్తించారు. వాటిల్లో ఏ ఒక్కదానికీ లేని భిన్నత్వం కే2-18బీలో ఉన్నట్లు యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్త గివోవన్నా టినెట్టి వెల్లడించారు. అక్కడి వాతావరణం 80 శాతం వరకు భూమిని పోలి ఉందని తెలిపారు. వాతావరణం, ఉష్ణోగ్రతలు, తరచూ అందులో చోటు చేసుకునే మార్పులు.. అచ్చంగా భూమిని పోలి ఉందని ఆయన తాను నేచర్ అస్ట్రానమీలో తాను రాసిన వ్యాసంలో పొందుపరిచారు. భూమి కంటే ఎనిమిది రెట్లు అధిక బరువు, రెండు రెట్లు పెద్దదైన ఆ గ్రహానికి చేరుకోవాలంటే 111 కాంతి సంవత్సరాల సమయం పడుతుందని వెల్లడించారు.
ఓ సముద్రమే ఉండొచ్చు..
కే2-18బీ గ్రహంపై ఓ పెద్ద సముద్రమే ఉండటానికి అవకాశాలు ఉన్నాయని టినెట్టి అభిప్రాయపడ్డారు. ఇప్పటిదాకా కనుగొన్న చాలా గ్రహాల్లో ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వాయువు (గ్యాస్)లు అలముకుని ఉన్నట్లు గుర్తించామని, వాతావరణం అనేది కనిపించేది కాదని అన్నారు. ఈ ఒక్క గ్రహంలోనే నీరు ద్రవరూపంలో ఉన్నట్లు తేలిందని చెప్పారు. అమెరికా అంతరిక్ష పరిశోధక కేంద్రం నాసా ప్రయోగించిన కెప్లర్ స్పేస్ క్రాఫ్ట్ దీన్ని కనుగొన్నది. అనంతరం 2016, 2017 మధ్యకాలంలో దీనిపై విస్తృతంగా పరిశోధనలు సాగించారు. హాబుల్ టెలిస్కోప్ నుంచి అనేక కోణాల్లో ఫొటోలను తీశారు. భూగోళంతో పోల్చుకుంటే కే2-18బీ గ్రహం ధృవాల్లోనూ రెండు శాతం నుంచి సుమారు 50 శాతం వరకు నీరు ద్రవరూపంలో ఉండటానికి అవకాశం ఉందని అన్నారు. రేడియేషన్ ప్రభావం కూడా అధికంగా ఉంటుందని అంచనా వేశారు.