డేంజర్ మార్క్: దేశ రాజధానిని భయపెడుతున్న యమున: కేజ్రీవాల్ అత్యవసర భేటీ!
న్యూఢిల్లీ: దేశ రాజధానికి వరద ముప్పు భయపెడుతోంది. ఢిల్లీకి ఆనుకుని ప్రవహిస్తోన్న యమునా నది ఉగ్రరూపాన్ని దాల్చింది. సోమవారం ఉదయం ప్రమాదకర స్థాయిని మించి ఉరకలు వేస్తోంది. ఫలితంగా- న్యూఢిల్లీలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలను హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఉత్తరాఖండ్ లోని యమునోత్రి యమునానది జన్మస్థానం. ప్రస్తుతం ఉత్తరాఖండ్ పరిస్థితి ఎలా తయారైందో మనకు తెలుసు. రెండువారాలుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలతో అల్లాడుతోంది ఆ దేవభూమి. విరుచుకుపడుతున్న కొండ చరియలు, ముంచెత్తుతున్న నదులతో చివురుటాకులా వణికిపోతోంది. ఉత్తరాఖండ్ లో సంభవించిన వరదల వల్ల యమునా నది నిండుకుండలా మారింది. దీని ప్రభావంతో దేశ రాజధాని వరద ముప్పు అంచుల్లో నిలిచింది.
ముఖ్యమంత్రి అత్యవసర భేటీ..
యమునా నది ప్రమాదకర హెచ్చరిక 204 మీటర్లు. సోమవారం ఉదయం ఈ మార్క్ ను అందుకుంది యమున. డేంజర్ లెవల్ మార్క్ ను దాటి ప్రవహిస్తోంది. యమునా నదిపై హర్యానాలో నిర్మించిన హత్ని కుండ్ బ్యారేజీ నుంచి ఎనిమిది లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు అధికారులు. దీని ప్రభావంతో యమునా నది మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. గంట గంటకు వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు ప్రారంభించి, దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన అప్రమత్తం చేశారు. పౌర రక్షణ యంత్రాంగాన్ని లోతట్టు ప్రాంతాల్లో మోహరింపజేశారు.
ఉత్తరాదిని వణికిస్తోన్న వరదలు..
నిన్నటి దాకా దక్షిణాది రాష్ట్రాలను వణికించిన భారీ వర్షాలు ఇక ఉత్తరాదికి షిఫ్ట్ అయ్యాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ లల్లోఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్క హిమాచల్ ప్రదేశ్ లోనే 22 మంది ఈ వరదల వల్ల మృత్యువాత పడ్డారు. పలువురు గల్లంతయ్యారు. రాజధాని సిమ్లా, కుల్లు, సోలన్, చంబా, లాహౌల్ జిల్లాలు అతలాకుతలమౌతున్నాయి. కొండ చరియలు విరిగిపడటం వల్ల పలు జిల్లాల్లోని గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సెల్ ఫోన్లు పనిచేయట్లేదు. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. రోడ్డు మార్గాలు మూసుకుపోయాయి. ఉత్తరాఖండ్ లో మృతుల సంఖ్య మరింత పెరిగింది. సోమవారం ఉదయం నాటికి 40 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
పునరావాస శిబిరాల్లో లక్షలాది మంది
కులూ పట్టణంలో ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకుపోగా, వరదల ఉధృతికి ఓ వంతెన తెగిపోయింది. బియాస్ నది ఉప్పొంగి వరదనీరు మండీ జిల్లా హంగోయి వద్ద చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిని ముంచెత్తింది. ఫలితంగా- ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఇదే పరిస్థితి మరి కొన్నిరోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా సహాయ, పునరావాస చర్యలను చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ లల్లో సుమారు 25 వేలకు పైగా సహాయ, పునరావాస శిబిరాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. సుమారు మూడు లక్షల మందికి పైగా నిరాశ్రయులు ఆయా శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. హర్యానాలో ఇదే పరిస్థితి నెలకొంది. హత్ని కుండ్ బ్యారేజీ బ్యాక్ వాటర్ గతంలో ఎప్పుడూ లేని స్థాయికి చేరుకోవడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. అక్కడి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.