'రైల్వే ప్రయాణికులకు డేంజర్ అలర్ట్'
న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులూ.. బీ అలర్ట్. ఇకనుంచి ప్రయాణాల్లో మీతో పాటు ఓ వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మంచిదేమో! ఎందుకులే.. రైల్వే స్టేషన్లలో ఎలాగు కొలాయిలు ఉంటాయి కదా.. అనుకుంటే అనారోగ్యం బారిన పడ్డట్టే. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఈఎస్) వెల్లడించిన తాజా నివేదికలో ఈ విషయం బయటపడింది.
ప్రయాణికులకు ఇండియన్ రైల్వే అందిస్తోన్న సేవలు అతి దారుణంగా ఉన్నాయని వెల్లడించింది బీఈఎస్. జాతీయ ఆరోగ్య, పర్యావరణ సంస్థ, జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రైల్వే స్టేషన్ లోని నల్లాల ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటిలో ప్రతి 100ఎమ్ఎల్ నీటిలో 10 యూనిట్ల థర్మోటోలరెంట్ క్లోరోఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లుగా బీఈఎస్ నివేదికలో స్పష్టమైంది.
బాక్టీరియా పేరుకుపోయిన ఈ నీటిని తాగడం ద్వారా డయేరియా, ఉదర సంబంధ వ్యాధులు, గాస్ట్రిక్ ట్రబుల్ వంటి వ్యాధులు సోకే ప్రమాదముందని బీఈఎస్ హెచ్చరించింది. దక్షిణాదితో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఢిల్లీ, పంజాబ్, గజియాబాద్,వారణాసి తదితర ప్రాంతాల రైల్వేస్టేషన్లలోని తాగునీటిలో ఈ బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు నిర్దారించారు.
దీనిపై స్పందించిన రైల్వే అధికారులు మాత్రం.. అలాంటిదేమి లేదనడం గమనార్హం. అయితే కొన్ని రైల్వే స్టేషన్లలో మాత్రమే ఈ సమస్య ఉందని, నిర్వహణ లోపాల కారణంగా కొన్ని చోట్ల మాత్రమే ఈ పరిస్థితి నెలకొందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రతీ స్టేషన్ లో తాగునీటిని శుద్ది చేయడం తప్పనిసరిగా చేస్తున్నామని వివరించారు.