ఒక్క చుక్క నీరివ్వం: పాక్కు మోడీ గట్టి హెచ్చరిక
పాక్కు జీవనాధారమైన సింధు నది జలాలను ఒక్క చుక్క కూడా పాక్కు వదలమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
బటిండా: భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. పాక్కు జీవనాధారమైన సింధు నది జలాలను ఒక్క చుక్క కూడా పాక్కు వదలమని స్పష్టం చేశారు. మన దేశం నుంచి పాక్ వెళుతున్న జలాలను పూర్తిగే ఉపయోగించుకునే హక్కు ఉందని ప్రధాని తెలిపారు. సింధూ జలాలు భారత హక్కు.. కానీ, పాకిస్థాన్కు ఆ జలాలన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పారు.
శుక్రవారం పంజాబ్ లోని బటిండాలో ఎయిమ్స్ శంఖుస్థాపన సందర్భంగా మోడీ బహిరంగసభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మన దేశం నుంచి వెళుతున్న సింధు నదీ జలాలు పాక్ గుండా వెళ్లి సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లను మన రైతులకు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ నీళ్లను ఒక్క చుక్క కూడా పాక్ కు వెళ్లకుండా చేస్తాం' అని మోడీ అన్నారు.
1960లో జరిగిన'ఇండస్ ఒప్పందం' ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు... ఇండస్ (సింధు), జీలం, చీనాబ్ నదులు పాక్కు దక్కాయి. ఈ అంశానికి సంబంధించి ఇరు దేశాల అధికారులూ ఉన్న 'ఇండస్ వాటర్ కమిషన్'ను సస్పెండ్ చేయాలని మోడీ భావిస్తున్నారు. ఈ నదులన్నీ భారత్ మీదుగా పాకిస్థాన్లోకి ప్రవేశిస్తున్నవే కావడం గమనార్హం.
కాగా, మోడీ ఈ విషయంపై స్పష్టంగా మాట్లాడటంతో పాకిస్థాన్లో అలజడి రేగింది. నిజంగా ఇదే జరిగితే, పాక్లోని సారవంతమైన భూములన్నీ బీడుగా మారతాయి. అసలే పాకిస్థాన్ ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక నీళ్లు కూడా లేకపోతే అక్కడ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారే అవకాశాలు లేకపోలేదు.
కాగా, భారత్ ఎప్పుడూ స్నేహ హస్తం అందిస్తూనే ఉన్నా.. పాక్ మాత్రం వైరమే కోరుకుంటోంది. శుక్రవారం ఉదయం జమ్మూకాశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను అమరుడయ్యాడు.