రైతు చేతికి అధికారం: మద్దతు ధర కొనసాగింపు: వ్యవసాయ బిల్లులపై మోదీ హర్షం - ఆ ఎంపీలపై చర్యలు?
వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలుగా భావిస్తోన్న బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగ చరిత్రలో ఇదొక శుభదినమని ఆయన అన్నారు. ఈ బిల్లులతో రైతుకు మేలు చేసే ఎన్నో మార్పులు వస్తాయని, దళారీ వ్యవస్థ నుంచి రైతులు విముక్తులవుతారని, మొత్తంగా రైతన్న చేతికి అధికారం వస్తుందని చెప్పారు.
పూర్తి భిన్నంగా జగన్, కేసీఆర్ - మోదీ సర్కాను గట్టెక్కించిన వైసీపీ - బంగారు బాతును చంపేశారన్న కేకే
రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లులు ఆదివారం రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ లో తన సంతోషాన్ని పంచుకున్నారు. కొత్త బిల్లులతో పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కనుమరుగైపోతుందన్న విపక్షాల వాదనను ఆయన తోసిపుచ్చారు. కనీస మద్దతు ధరను కొనసాగించితీరుతామని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ప్రధాని పునరుద్ఘాటించారు.
''దేశవ్యవసాయ చరిత్రలో ఇదొక శుభదినం. ఈ బిల్లులు.. వ్యవసాయ రంగంలో మార్పలు తీసుకురావడంతోపాటు కోట్లాది మంది రైతుల చేతికి అధికారం ఇస్తుంది. దశాబ్దాలుగా రైతు సోదరులు.. దళారీల కబందహస్తాల్లో చిక్కుకుపోయారు. ఇవాళ పార్లమెంట్ లో ఆమోదించిన బిల్లుతో వారికి పూర్తి స్వేచ్ఛ లభించినట్లయింది. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న మా సంకల్పానికి కూడా ఈ బిల్లులు దోహదపడతాయి. రైతులకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. కనీస మద్దతు ధరను కొనసాగిస్తాం. రైతులకు మెరుగైన జీవనం అందించడమే మా లక్ష్యం'' అని ప్రధాని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే..
మైక్ విరగొట్టి.. ప్రతులు చించేసి - ప్రతిపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదం
Recommended Video
వ్యవసాయ బిల్లులపై చర్చ, ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో రచ్చ చేసిన విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా చైర్మన్ ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కోరారు. రైతులకు మేలు చేసే బిల్లుల్ని అడ్డుకోవాలని ప్రయత్నించడమేకాక, సభలో నిబంధలకు విరుద్ధంగా ఎంపీలు వ్యవహరించారని, కొవిడ్ రూల్స్ ను ధిక్కరిస్తూ పోడియంలోకి చొచ్చుకొచ్చారని నడ్డా మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ సందర్భంలో పోడియంలోకి దూసుకొచ్చి, పేపర్లు చింపేసి, మైక్ విరగొట్టే ప్రయత్రం చేసిన టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ తిరుచిల తదితరులపై రాజ్యసభ చైర్మన్ చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.