రాహుల్ గాంధీకి థ్రెట్? వాయనాడ్ లో మావోయిస్టుల కలకలం: ఎన్నికలను బహిష్కరించాలంటూ హెచ్చరికలు
తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాలు అత్యధికంగా ఉండే వాయనాడ్ జిల్లాపై మొదటి నుంచీ మావోయిస్టులకు గట్టి పట్టు ఉంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాయనాడ్ లోక్ సభ నుంచి పోటీ చేస్తుండటంతో.. మావోయిస్టులు మరోసారి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ పోస్టర్లు అంటించారు. ఈ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. దీనితో కేరళ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
తెలుగింటి ఆడపడుచుకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం
అటవీ ప్రాంతాల్లో పోస్టర్లు..
వాయనాడ్ లోక్ సభ పరిధిలో కల్పెట్ట, సుల్తాన్ బథేరీ, మనన్థవడీ, తిరువంబాడి, నీలంబూర్, వాండూర్, ఎర్నాడ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలో అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉండే గ్రామాలపై మావోయిస్టులకు గట్టి పట్టు ఉంది. ఈ సారి రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తుండటాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మావోయిస్టులు వ్యూహం పన్నినట్టు కేరళ ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. రాహుల్ గాంధీపై దాడి చేయడం లేదా, ఆ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకోగలిగితే.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని మావోయిస్టులు భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికలను బహిష్కరించాలంటూ వార్నింగ్..
ఈ అనుమానాలను నిజం చేసేలా.. కల్పెట్ట, తిరువంబాడి, ఎర్నాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలనేది వారి ప్రధాన డిమాండ్. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ పోస్టర్లను అంటించారు. ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా- రాహుల్ గాంధీ వాయనాడ్ లోక్ సభ పరిధిలో రోడ్ షోలు నిర్వహించాల్సి ఉంది. పలు చోట్ల బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పోలీసులు అదనపు భద్రతను పెంచారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
తేలిగ్గా తీసుకున్న ఎల్డీఎఫ్..
పోలింగ్ సందర్భంగా మావోయిస్టులు అనూహ్యంగా దాడులు చేయవచ్చని ఇంటెలిజెన్స్ విభాగం నిర్ధారించినట్లు చెబుతోంది. ఫలానా నాయకుడిని టార్గెట్ గా చేసుకునే అవకాశం ఉందని ధృవీకరించకపోయినా.. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించడానికి మావోయిస్టులు ఈ ఎన్నికలను ఓ సాధనంగా వినియోగించుకునే అవకావం ఉందని, అలాంటి రాజకీయ నాయకుడిని లక్ష్యంగా చేసుకోవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి పీపీ సునీర్ మాత్రం..ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చిరకలను తేలిగ్గా తీసుకున్నారు. దీన్ని ఎన్నికల స్టంట్ గా ఆయన అభివర్ణిస్తున్నారు. ప్రశాంతమైన వాయనాడ్ లో ఉద్దేశపూరకంగా కలకలం రేపడానికి మావోయిస్టుల పేరును ఉపయోగించుకుంటున్నారని కొట్టి పడేశారు.
వాయనాడ్ రానున్న హేమాహేమలు..
రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తుండటంతో.. అన్ని రాజకీయ పార్టీల అధినేతల కన్ను ఈ స్థానంపై పడింది. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. పలుచోట్ల ఆయన రోడ్ షోలను నిర్వహించబోతున్నారు. ఈ దిశగా బీజేపీ కేరళ శాఖ నాయకులు ఓ రూట్ మ్యాప్ ను రూపొందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వాయనాడ్ లో బహిరంగ సభలో ప్రసంగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిలతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు వాయనాడ్ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో- మావోయిస్టుల పోస్టర్లు కనిపించడం కలకలం రేపింది.