రైల్వే స్టేషన్లో తొక్కిసలాట: ఇద్దరు మృతి, 20మందికి గాయాలు
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని సంత్రగచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఇద్దరు మృతి చెందారు. మరో 20మంది వరకు గాయాలపాలయ్యారు. మంగళవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఒకేసారి మూడు రైళ్లు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తాము ఎక్కాల్సిన రైళ్ల కోసం పరుగులు తీశారు. దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
మూడు, నాలుగు ప్లాట్ ఫాంల మధ్య ఈ తొక్కిసలాట జరిగిందని రైల్వే అధికారి సంజయ్ ఘోష్ తెలిపారు. నాగర్ కోయిల్-షాలిమార్ ఎక్స్ప్రెస్, అదే సమయంలో మరో రెండు లోకల్ రైళ్లు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు.
West Bengal: 14 injured in a stampede following heavy rush of passengers on a footbridge at Santragachhi junction in Howrah. Injured shifted to hospital pic.twitter.com/CJw1oXbFSC
— ANI (@ANI) October 23, 2018
ఖరగ్పూర్: 032221072, సంత్రగచ్చి: 03326295561 హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా, ఘటనపై మొదట రైల్వే అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ తొక్కిసలాట చోటు చేసుకుందని ఆరోపించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆ తర్వాత రైల్వే శాఖను తాము నిందించమని అన్నారు. బాధ్యులపై విచారణ తర్వాత చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.1లక్ష, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం అందించనున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.