బీజేపీ ఉపాధ్యక్షుడిని తరిమి కొట్టిన తృణమూల్ కార్యకర్తలు: కాళ్లతో తన్ని, రోడ్డుపక్కకూ ఈడ్చేసి..!
Recommended Video
కోల్ కత: భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడికి చేదు అనుభవం ఎదురైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను తరిమి కొట్టారు. చుట్టుముట్టి ముష్ఠిఘాతాలు కురిపించారు. కాళ్లతో తన్నారు. రోడ్డు పక్కన ఉన్న పొదల్లో ఈడ్చి పడేశారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది సైతం ఈ దాడిని అడ్డుకోలేకపోయారు. పశ్చిమ బెంగాల్ లోని కరీమ్ పూర్ లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
#WATCH West Bengal BJP Vice President and candidate for Karimpur bypoll, Joy Prakash Majumdar manhandled and kicked allegedly by TMC workers as voting is underway in the constituency. #WestBengal pic.twitter.com/Vpb5s14M5A
— ANI (@ANI) November 25, 2019
ప్రస్తుతం కరీమ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున జోయ్ ప్రకాశ్ మజుందార్ పోటీ చేస్తున్నారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి కరీమ్ పూర్ నియోజకవర్గం బ్లాక్ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను గుర్తించారు. మజుందార్ ప్రయాణిస్తోన్న కారుకు అడ్డుపడ్డారు.
కారు నుంచి కిందికి దిగిన మజుందార్ తో వాగ్వివాదానికి దిగారు. నిషేధాజ్ఞలు ఉన్న సమయంలో పోలింగ్ కేంద్రానికి ఎలా వెళ్తారంటూ నిలదీశారు. దీనితో మజుందార్ ఆగ్రహించారు. టీఎంసీ కార్యకర్తలను వెనక్కి తోశారు. దీనితో ఆగ్రహోదగ్రులైన టీఎంసీ కార్యకర్తలు ఆయనను చుట్టుముట్టారు. పిడిగుద్దులు గుద్దారు. ముష్టిఘాతాలు కురిపించారు. రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి తోసి వేశారు. కాళ్లతో తన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ ఘటనపై మజుందార్ కరీమ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయనపై దాడి చేసిన వారిని గుర్తిస్తున్నామని, త్వరలోనే దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తామని అన్నారు. కొందరు అనుమానితులపై మజుందార్ లిఖిత పూరకంగా ఫిర్యాదు చేశారు. కొందరి పేర్లను కూడా ఆయన ఫిర్యాదు పత్రంలో రాశారని అంటున్నారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తిస్తామని కరీమ్ పూర్ పోలీసులు వెల్లడించారు.