షాక్: సొంత కూతురును కోసి మాంసాన్ని తిన్న తల్లి
మాల్దా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో మరో దిగ్ర్భాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన నాలుగేళ్ల కూతురు తల భాగాన్ని కోసేసి ఆ మాంసాన్ని తింటుండగా పలువురు గ్రామస్తులు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మాల్దా జిల్లాలోని గోపాల్పూర్ గ్రామానికి చెందిన ప్రమీల(42) అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. తన ఇంట్లోనే ముక్కలుగా చేసిన మాంసాన్ని ప్రమీల తింటుండగా, ఆమె మరిది దబ్లు మండల్ చూశాడు.
దబ్లు మండల్ భార్య ఈ ఘటనపై మాట్లాడుతూ.. ‘నా భర్త ఇంట్లోకి ప్రవేశించగానే చిన్నారి అరుపులు వినిపించాయి. ఆ చిన్నారి ఆమె తల్లి ఒడిలో ఉంది. అయితే ఆ చిన్నారి తల మాంసాన్ని కోసి ప్రమీల తింటోంది. ఈ ఘటనను వర్ణించడానికి మాటలు రావట్లేదు. అదే సమయంలో ఆమె కొడుకు స్వర్ణ కూడా అదే గదిలో నిద్ర పోతున్నాడు' అని తెలిపింది.
కాగా, బాధిత చిన్నారి భారతిని ప్రమీల సోదరుడు రక్షించాడు. హుటాహుటిన ఆ చిన్నారిని మాల్దా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చాలా రక్తం పోయింది. వైద్యులు ఆమెకు వెంటనే చికిత్స ప్రారంభించారు.
కాగా, విషయం తెలిసిన గ్రామస్తులు ప్రమీలను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటన స్థలానికి చేరుకుని ప్రమీలను రక్షించారు. కాగా, ఇంతకుముందు కూడా ప్రమీల ఇలాంటి చర్యలకు పాల్పడిందని గ్రామస్తులు చెప్పారు. ఐదుగురు పిల్లలకు తల్లి అయిన ప్రమీల.. ఆమె మరో కూతురు పర్బాతిని నిప్పంటించి చంపేందుకు ప్రయత్నించిందని తెలిపారు.
మత్తుపదార్థాలకు అలవాటు పడిన ప్రమీల.. గత బుధవారం నుంచి మద్యం సేవిస్తోందని గ్రామస్తులు తెలిపారు. కాగా, కూలీ పని నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ప్రమీల భర్త హబు మండల్ ఇంకా తిరిగి రాలేదని చెప్పారు. ప్రమీల ఇద్దరు కూతుళ్లకు రెండేళ్ల కిందట వివాహమైందని, మరో ఇద్దరు కూతుళ్లు, రెండేళ్ల కొడుకుతో ఉంటోందని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, తీవ్రంగా గాయపడిన చిన్నారి భారతి పరిస్థితి విషమంగా ఉందని, ఐసియూలో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఘటనపై అవసరమైతే జువైనల్ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రమీల కుటుంబం పేదరికంలో ఉందని తెలిపారు. కాగా, ప్రమీలకు మానసిక పరిస్థితి సరిగా లేదని వైద్యులు తెలిపారు.