రోహిత్ ఔట్: పాక్ అంపైర్పై బంగ్లా ఫ్యాన్స్, మీడియా గరం
ఢాకా: బంగ్లాదేశ్, భారత్ మధ్య గురువారం జరిగిన ఐసిసి ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచులో రోహిత్ శర్మ ఔట్పై పాకిస్తాన్ అంపైర్ ఇచ్చిన తీర్పుపై బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ మీడియా దుమ్మెత్తిపోసింది. బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఇయాన్ గౌల్డ్తో పాటు దార్ గురువారంనాటి మ్యాచులో అంపైర్లుగా వ్యవహరించారు. అంపైర్ల నిర్ణయం తమ జట్టును దెబ్బ తీసిందని మండిపడుతున్నారు. రుబెల్ హొస్సేన్ రోహిత్ శర్మకు వేసిన బంతిని అంపైర్ నోబాల్గా ప్రకటించారు. అది లేచిన ఎత్తును బట్టి అంపైర్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, టెలివిజన్ ఫుటేజీ మాత్రం అది సరైన బంతేనని నిర్ధారించింది. రోహిత్ శర్మ కొట్టిన ఆ బంతిని బంగ్లాదేశ్ ఫీల్డర్ క్యాచ్ పట్టాడు. అంపైర్ నాటౌట్గా ప్రకటించారు.
ఆ సమయంలో రోహిత్ శర్మ వ్యక్తిగత స్కోర్ 90 పరుగులు. ఆ తర్వాత రోహిత్ శర్మ రెచ్చిపోయి 126 బంతుల్లో 137 పరుగులు చేశాడు. దీంతో అతను సెంచరీ చేయడమే కాకుండా భారత్ స్కోరు పరుగులు తీసింది. రోహిత్ శర్మ అవుట్ ఇచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదని బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు వాదిస్తున్నారు.
నిరసనకారులు షేమ్ షేమ్ అంటూ నో టు ఐసిసి కాన్సిపరసీ అంటూ నినాదాలు చేశారు. తొలిసారి సెమీ ఫైనల్లోకి అడుగు పెడుతామనే బంగ్లాదేశ్ కలలను అంపైర్ నిర్ణయం తీసిందని ఆరోపిస్తున్నారు. ఆ అంపైర్లను శిక్షించాలని, అంపైర్ తప్పు బంగ్లాదేశ్ కలను భగ్నం చేసింది - దేశం యావత్తు నిరసిస్తోంది, ఏం జరిగిందో మీరంతా చూశారని మొర్తాజా అన్నట్లు బంగ్లాదేశ్ మీడియా వ్యాఖ్యానించింది.