భారత్ను కుదిపేస్తున్న వివాదంపై ఫేస్బుక్ వివరణ... తేల్చి చెప్పిన సోషల్ మీడియా దిగ్గజం...
భారత్లో అధికార బీజేపీకి అనుకూలంగా ఫేస్బుక్ పాలసీ ఉందంటూ ఇటీవల వాల్స్ట్రీట్ ప్రచురించిన కథనం తీవ్ర సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతల వివాదాస్పద పోస్టులు,విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ చూసీ చూడనట్లు ఉపేక్షిస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు. దీని ఆధారంగా కాంగ్రెస్ కూడా బీజేపీ,ఫేస్బుక్లపై విరుచుకుపడింది.
ఎంపీ శశి థరూర్ నేత్రుత్వంలోని పార్లమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ దీనిపై వివరణ కోరుతూ ఫేస్బుక్కి నోటీసులు కూడా జారీ చేసింది. సెప్టెంబర్ 2న కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ నేతలు శశి థరూర్ తీరును తప్పు పడుతూ లోక్2సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫేస్బుక్ తాజాగా వివరణ ఇచ్చుకుంది.
ఫేస్బుక్ వివరణ ఇలా...
తమ వేదిక ఎప్పుడూ నిష్పక్షపాతంగానే పనిచేస్తోందని... నిబంధనలు ఉల్లంఘించే కంటెంట్ను ప్రముఖులు ఎవరైనా పోస్టు చేస్తే వాటిని తొలగించడం కొనసాగుతూనే ఉంటుందని ఫేస్బుక్ యాజమాన్యం స్పష్టం చేసింది. 'ఫేస్బుక్ ఇప్పటికీ,ఎప్పటికీ ఓ బహిరంగ పారదర్శక నిష్పక్షపాత వేదిక. ఇక్కడ ఎవరైనా స్వేచ్చగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. గత కొద్దిరోజులుగా మా పాలసీ అమలుతీరుపై మేము పక్షపాత ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. విద్వేషం,అసహనం ఏ రూపంలో ఉన్నా మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేస్తున్నాం.' అని భారత ఫేస్బుక్ ఉపాధ్యక్షుడు,మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ తన బ్లాగ్ పోస్టులో తెలిపారు.
కమ్యూనిటీ స్టాండర్డ్స్ ప్రకారమే...
కంటెంట్కు సంబంధించి ఫేస్బుక్ నిష్పక్షపాత విధానాన్ని కలిగి ఉందని... కమ్యూనిటీ స్టాండర్డ్స్తో అది పకడ్బందీగా నిర్వహించబడుతుందని అజిత్ మోహన్ తెలిపారు. మతాలకు,రాజకీయాలకు,పార్టీలకు,సాంస్కృతిక విశ్వాసాలకు అతీతంగా తమ పాలసీని ప్రపంచవ్యాప్తంగా అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఫేస్బుక్ వేదికలో ఏ కంటెంట్ ఉండాలో దాని కమ్యూనిటీ స్టాండర్డ్స్ నిర్ణయిస్తాయని... అవే ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా అమలుచేయబడుతాయని తెలిపారు.
విద్వేషం ఏ రూపంలో ఉన్నా...
'ఫేస్బుక్ వేదికలో ఏ కంటెంట్ని అనుమతించాలో... దేన్ని అనుమతించకూడదో... కమ్యూనిటీ స్టాండర్డ్స్ నిర్ణయిస్తుంది. విద్వేషం ఏ రూపంలో ఉన్నా మేము దాన్ని వ్యతిరేకిస్తాం. స్పీచ్ విషయంలో ఫేస్బుక్కి సమగ్రమైన విధానాలున్నాయి. కుల,మత,జాతి,జాతీయత ఆధారంగా ప్రజలపై దాడి చేసే కంటెంట్ని మా పాలసీ నిషేధిస్తుంది.' అని అజిత్ మోహన్ స్పష్టం చేశారు.
Recommended Video
విధాన రూపకల్పనలో...
తమ విధాన రూపకల్పన కోసం అంతర్గత టీమ్స్తో పాటు బయటి వ్యక్తుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా మానవ హక్కుల ఎన్జీవోలు,యాక్టివిస్టులు,అకడమిక్స్ అభిప్రాయాలను తెలుసుకుంటామని... తద్వారా వ్యక్తీకరణ విషయంలో భిన్న దృక్పథాలను అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని ఫేస్బుక్ ప్రతినిధి అజిత్ మోహన్ తెలిపారు. అలాగే తమ పాలసీలు భిన్న వర్గాలుపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో అవగతం అవుతుందన్నారు.