మేము రాజకీయాలకు దూరం..ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తాం: సీడీఎస్ బిపిన్ రావత్
న్యూఢిల్లీ: రాజకీయాలకు దూరంగా ఉంటూ దేశ భద్రత కోసమే పాటు పడుతామని ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటించి అమలు చేస్తామని అన్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తొలి అధిపతి జనరల్ బిపిన్ రావత్. రాజకీయాలకు జనరల్ బిపిన్ రావత్ తలొగ్గుతున్నారన్న ఆరోపణలు రావడంపై ఆయన పై విధంగా స్పందించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆదేశాల మేరకే తాము పనిచేయాల్సి ఉంటుందని చెప్పిన బిపిన్ రావత్ ఇందులో రాజకీయాలకు తావు ఉండదని స్పష్టం చేశారు.
త్రివిధ దళాల సమగ్ర సేవలను వినియోగించుకుని ఒక జట్టుగా పనిచేస్తామని సీడీఎస్ బిపిన్ రావత్ చెప్పారు. దీనిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనలపై చోటుచేసుకున్న హింసపై మాట్లాడి విమర్శల పాలయ్యారు జనరల్ బిపిన్ రావత్. ఓ కార్యక్రమంలో మాట్లాడిన రావత్.. ప్రజలను తప్పుదోవలో నడిపించే వారు నాయకులు కారని, యూనివర్శిటీ, కాలేజీ విద్యార్థులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపిస్తున్నారనే వ్యాఖ్యలను చేశారు.
జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బిపిన్ రావత్ తన పరిధిని మించి మాట్లాడుతున్నారని అది ఆయనకు మంచిది కాదని చెప్పారు. దేశ పౌరులు ఏమి కావాలనుకుంటున్నారో అది ప్రభుత్వాలు చేయాలి తప్పితే ఇష్టానుసారంగా వ్యవహరించరాదనే విషయాన్ని జనరల్ బిపిన్ రావత్ గుర్తెరగాలని ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతను కాపాడేలా ప్రభుత్వాలు పనిచేయాలని అసదుద్దీన్ చెప్పారు.
Chief of Defence Staff(CDS) General Bipin Rawat on allegations that he is politically inclined: We stay far away from politics, very far. We have to work according to the directions of the Government in power pic.twitter.com/CYQnp3C9o6
— ANI (@ANI) January 1, 2020
ఇదిలా ఉంటే జనవరి 1న జనరల్ బిపిన్ రావత్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.