కాంగ్రెస్తో సిద్ధం: దినకరన్ సంచలన వ్యాఖ్యలు, శశికళ ఆదేశాలతోనే
చెన్నై: కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు డీఎంకేను వీడి వస్తే కాంగ్రెస్తో కలిసి తాము వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
చిన్నమ్మ శశికళ ఆదేశాలతోనే దినకరన్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. ఆయన కర్ణాటకలోని బెంగళూరు జైలులో ఉన్న శశికళతో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.
తమిళనాడులో ఇప్పటికే అన్నాడీఎంకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ లోకసభ సీట్లు టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.
అయితే, దినకరన్ ఆహ్వానానికి కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాంగ్రెస్, డీఎంకేలు అక్కడ ఒక్కటిగా ఉన్నాయి. ఇన్నాళ్లు అన్నాడీఎంకే ఒంటరిగా ఉంది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే చీలి.. పన్నీరుసెల్వం - పళనిస్వామి వర్గం బీజేపీకి దగ్గరైంది. శశికళ వర్గం ఒంటరిపోరు చేస్తోంది. ఈ నేపథ్యంలో దినకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.