లంకాధీశుడే దేవుడు: ఈ పుణ్యభూమి రావణుడిదే: రామచంద్రుడికి చోటు లేదు: తమిళులు
చెన్నై: కోట్లాదిమంది హిందువులు ఎప్పుడెప్పుడా అంటూ కలలుగంటోన్న అపురూపమైన రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామమందిరం నిర్మాణానికి భూమిపూజ ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు.. ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్వీట్లు వస్తున్నాయి. ఆ ట్వీట్లు ఏ పొరుగు దేశ పౌరులో లేక.. ఏ అన్యమతానికి చెందిన వారో చేయట్లేదు. తమిళనాడు నుంచి ఆ ట్వీట్లు వెలువడుతున్నాయి.. వెల్లువెత్తుతున్నాయి.
Recommended Video
రామరాజ్యానికి పునాది..సరయూ తీరంలో భారతీయ ఏకాత్మత: తెలుగు నేతల భావోద్వేగం
లంకాధీశుడే అసలు దేవుడు..
ఆయా ట్వీట్ల సారంశం అంతా ఒక్కటే- లంకాధీశుడు రావణాసురుడే దేవుడు. తమిళుల గర్వకారకుడు. ఈ పుణ్యభూమి ఆయనదే.. శ్రీరామచంద్రుడికి చోటు లేదు అనేదే. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే రావణాసురుడికి..సీతమ్మను అగ్నిప్రవేశం చేయించి, మహిళలను కించపరిచిన శ్రీరాముడి మధ్య అసలు పోలికే లేదని అంటున్నారు. శ్రీరాముడిని దేవుడిలా పూజించడం ఏ మాత్రం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. ట్వీట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
జాతి వివక్షకు కారకుడు..
శ్రీరామచంద్రుడు జాతి వివక్షకు ఆద్యుడంటూ తమిళులు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన దగ్గరి నుంచే జాతి వివక్ష ఆరంభమైందని చెబుతున్నారు. దళితుల పట్ల అగ్రవర్ణాల వివక్షను చూపడం శ్రీరాముడి కాలం నుంచే ప్రారంభమైందని అంటున్నారు. దేశం ఇప్పుడు ఎదుర్కొంటోన్న సామాజిక అసమానతలు, రుగ్మతలకు కారణం శ్రీరాముడేనని చెబుతున్నారు. మహిళల పట్ల భేదభావాన్ని చూపడం కూడా అక్కడి నుంచే వచ్చిందని అంటున్నారు.
సీతతో అగ్నిప్రవేశం.. శూర్పణఖ ముక్కు చెవులు కోయడం..
రామలక్ష్మణులు ఇద్దరూ మహిళలను భేదభావంతో చూశారని తమిళులు మండిపడుతున్నారు. కొద్దిరోజులు లంకలో గడిపిన భార్య సీతను రామచంద్రుడు శంకించాడని, అందుకే అగ్నిప్రవేశం చేయించాడని అంటున్నారు. అదే భేదభావం ఈ నాటికీ దేశంలో కొనసాగుతోందని అంటున్నారు. అలాగే- లక్ష్మణుడు నిమ్న జాతికి చెందిన శూర్పణఖ ముక్కు, చెవులను కోసి, అవమానించాడని గుర్తు చేస్తున్నారు. అలాంటి వారిని పూజించడం సరికాదని సూచిస్తున్నారు.
అపార మేధాసంపన్నుడిగా..
రావణుడు అపార మేధాసంపన్నుడని తమిళులు కీర్తిస్తున్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడని, దాని కోసం ఎంతవరకైనా పోరాడాడని చెబుతున్నారు. రావణ రాజ్యంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో గడిపారనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయనే వాదిస్తున్నారు. తమిళుల ఆరాధ్య దేవుడు రావణాసురుడేనని స్పష్టం చేస్తున్నారు. తమిళ గడ్డ మీద రావణాసురుడికి భారీ ఆలయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.