రాఫెల్ డాక్యుమెంట్లు తమ చేతికి ఎలా వచ్చాయో అనేదానిపై పత్రికాధిపతి వివరణ
ఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి తమ వద్ద లభించిన ఆధారాలు ఎవరు ఇచ్చారనేదానిపై తమను అడిగే హక్కు ఎవరికీ లేదని చెప్పారు ప్రముఖ జాతీయ పత్రిక దిహిందూ ఛైర్మెన్ ఎన్.రామ్. అసలు డాక్యుమెంట్లు బయటకు లేదా తమ చేతికి ఎలా వచ్చాయన్నది ప్రశ్న కాదని చెప్పిన రామ్... ఇందులో అవినీతి జరిగిందా లేదా అన్నదానిపైనే దృష్టి సారించాలని చెప్పారు. ఇదిలా ఉంటే తాము ఎక్కడా డాక్యుమెంట్లను చోరీ చేయలేదని రామ్ స్పష్టం చేశారు. తామంతా సురక్షితంగానే ఉన్నట్లు చెప్పారు.
ఇక రాఫెల్ వివాదంపై మాట్లాడిన రామ్... రాఫెల్లో జరిగింది ఒప్పందం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ కంపెనీ నుంచి తొలి రాఫెల్ యుద్ధ విమానం ఈ ఏడాది సెప్టెంబర్లో వస్తుందని చెబుతున్నారు కానీ యుద్ధ విమానం నాణ్యతపై కానీ అసలు వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరంపై కానీ ఎవరూ ప్రశ్నించడంలేదని అన్నారు. ఇప్పటి వరకు తన పత్రికలో రాఫెల్పై వరుస కథనాలను రామ్ రాశారు. ఇక యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలనే నిర్ణయం ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేదానిపై ప్రశ్నించాలని అదేసమయంలో ఒప్పందం పై బహిరంగ చర్చ జరగాలని రామ్ అభిప్రాయపడ్డారు.
రాఫెల్ వివాదం: మోడీని విచారణ చేసేందుకు ఇంతకంటే రుజువులు ఏమి కావాలి
కొత్త ఒప్పందం పాత ఒప్పందం కంటే ఎందులో బాగుంది..? లేక బేరసారాల్లో భారత్ ఎక్కడైనా తలొగ్గిందా... అని రామ్ ప్రశ్నించారు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని కేవలం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వల్లే బయటపడిందని అభిప్రాయపడ్డారు. రాఫెల్ ఒప్పందం గురించి ప్రజలకు చెప్పకుండా ప్రభుత్వం దాచి ఉంచిందని అదే సమాచారాన్ని తాము ప్రజల ప్రయోజనాలమేరకు బహిర్గతం చేశామని రామ్ చెప్పారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 8వ తేదీన ది హిందూ పత్రికలో వచ్చిన కథనంలో రాఫెల్ ఒప్పందంపై ఓ వైపు రక్షణశాఖ అధికారులు మాట్లాడుతుండగానే మరోవైపు ప్రధాని కార్యాలయం కూడా ఫ్రాన్స్తో చర్యలు జరిపిందన్న విషయాన్ని ప్రచురించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ఇదంతా ప్రభుత్వం దగ్గర ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగానే కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం తమ వద్ద ఉన్న రాఫెల్ డాక్యుమెంట్లను ఎవరో దొంగలించారని బుధవారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం విశేషం. అయితే ఈ డాక్యుమెంట్లను దొంగలించి హిందూ పత్రికకు అందజేశారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు.