'మోదీ సర్కార్కు సందేశం పంపేందుకే... ఎర్రకోటపై రైతు జెండా.. లక్ష్యం చేరేవరకూ విశ్రమించం..'
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టమైన సందేశం పంపించామని రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న రైతులు పేర్కొన్నారు. పోలీసు నిర్బంధాలను,లాఠీచార్జిలను చేధించుకుంటూ ఎర్రకోట దాకా వెళ్లిన రైతులు... కోటపై రైతు జెండాను ఎగరవేసి విజయ గర్వంతో నినాదాలు చేశారు. లక్ష్యాన్ని చేరుకునేవరకూ తమను ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. ఎర్రకోట వైపు వందలాది దూసుకొచ్చిన రైతులను నిలువరించలేకపోయిన పోలీసులు... చివరకు టియర్ గ్యాస్,లాఠీచార్జి చేసి అక్కడినుంచి చెదరగొట్టారు.
మోదీ సర్కార్కు మా సందేశం...
'నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సందేశం పంపించేందుకే మేము ఇక్కడికి వచ్చాం. మా పని పూర్తయింది. ఇక తిరిగి వెనక్కి వెళ్లిపోతాం..' అని ఓ రైతు ప్రముఖ జాతీయ మీడియాతో పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ నెరవేరంతవరకూ తాము విశ్రమించేది లేదన్నారు. ఎర్రకోట ప్రాంగణంలోని స్తంభం పైకి అలవోకగా ఎక్కిన రైతులు అక్కడ తమ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆ జెండాను తొలగించేందుకు పోలీసులు అతికష్టంగా స్తంభం పైకి ఎక్కాల్సి వచ్చింది.
తిరిగి సింఘూ బోర్డర్కు రైతులు...
రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న రైతులంతా తిరిగి సింఘూ బోర్డర్ వద్దకు చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు వెనక్కి తిరిగి వెళ్తున్నారు. నిజానికి రాజ్పథ్లో నిర్వహించే అధికారిక పరేడ్ ముగిసిన తర్వాత రైతులను ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతించారు. అయితే రైతులు మాత్రం అంతకుముందే సెంట్రల్ ఢిల్లీలోకి చొచ్చుకెళ్లడంతో
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలాచోట్ల రైతులు బారికేడ్లను తొలగించుకుని ట్రాక్టర్లతో దూసుకెళ్లారు. పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీలతో విరుచుకుపడ్డారు.
హింసను ఖండించిన కిసాన్ మోర్చా
తాము శాంతియుతంగా చేపట్టిన ర్యాలీలోకి అసాంఘీక శక్తులు చొరబడ్డారని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించడం గమనార్హం. ఢిల్లీలో ఇవాళ చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను ఆ సంఘం ఖండించింది.హింసను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని... జరిగిన ఘటనలపై విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నవారికి తాము దూరంగా ఉంటామని చెప్పింది.