గాలి జనార్దన్ రెడ్డిని ప్రచారానికి పిలువలేదు, షాక్ ఇచ్చిన బీజేపీ, శ్రీరాములుకు సీటు, పాపం!
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని తాము ఎన్నికల ప్రచారానికి పిలువలేదని, ఆయన మాకు స్టార్ ప్రచారకుడు కాదని బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వామనాచార్య అన్నారు. మాళకాల్మురు నియోజక వర్గంలో గాలి జనార్దన్ రెడ్డి అభ్యర్థి కాదని డాక్టర్ వామనాచారయ్య స్పష్టం చేశారు.
గాలికి సీటు లేదు
హుబ్బళిలో బుధవారం బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వామనాచార్య మీడియాతో మాట్లాడారు. మాళకాల్మూరులో మా నాయకుడు, బళ్లారి ఎంపీ బి. శ్రీరాములు అని డాక్టర్ వామనాచార్య చెప్పాడు. మాళకాల్మూరులో బీజేపీ నుంచి శ్రీరాములు పోటీ చేస్తున్నారని, గాలి జనార్దన్ రెడ్డి కాదని డాక్టర్ వామనాచార్య అన్నారు.
గాలి ఏనుగు బలం కాదు
గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చేస్తుంటే మాకు ఏనుగు అంత బలం వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప ఎక్కడా చెప్పలేదని డాక్టర్ వామనాచార్య స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కావాలనే గాలి జనార్దన్ రెడ్డి, బీజేపీ ఒక్కటి అయ్యాయని ప్రచారం చేసున్నాయని ఆరోపించారు.
సీఎం సీద్దూ విఫలం
కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని డాక్టర్ వామనాచార్య ఆరోపించారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామని సిద్దరామయ్య ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఐదు జిల్లాల్లో మాత్రం పనులు జరిగాయని డాక్టర్ వామనాచార్య ఆరోపించారు.
కేంద్రం మీద కుట్ర
కర్ణాటకలో స్మార్ట్ సిటీలు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, అయితే ఆ నిధులు సిద్దరామయ్య ప్రభుత్వం ఉపయోగించుకోలేదని, కేంద్రం మీద కుట్రతో కర్ణాటక ప్రజలకు ద్రోహం చేశారని డాక్టర్ వామనాచార్య ఆరోపించారు.
గాలి ప్రాచారం
కర్ణాటకలో పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తోందని డాక్టర్ వామనాచార్య జోస్యం చెప్పారు. తన ప్రాణ స్నేహితుడు, బళ్లారి ఎంపీ శ్రీరాములు గెలుపు కోసం గాలి జనార్దన్ రెడ్డి మాళకాల్మూరు, బాదామి నియోజక వర్లాల్లో ప్రచారం చేస్తున్నారు.