మాకు బలం లేదు, మాకేం సంబరం లేదు: ముఫ్తీ రాజీనామాపై ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించాలని ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా మంగళవారం డిమాండ్ చేశారు. మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగానే ఒమర్ గవర్నర్ను కలిశారు. దీంతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు సాగుతున్నారా? లేక బీజేపీయేతర పార్టీలు ఒక్కటవుతున్నాయా? అనే చర్చ సాగింది. కానీ ఈ అనుమానాలపై ఆయన తేల్చిపారేశారు.
బీజేపీ దెబ్బ, జమ్ము కాశ్మీర్లో కలకలం: ముఖ్యమంత్రి పదవికి
గవర్నర్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి సరైన బలం లేదని, కాబట్టి గవర్నర్ పాలన విధించాలన్నారు. మేం ఎవరి మద్దతు కోరడం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను పునరుద్ధరించాలని తాము గవర్నర్ను కోరామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేదన్నారు.
బీజేపీ నిర్ణయాన్ని తాము ముందుగానే ఊహించామని చెప్పారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని చెప్పారు. పొత్తు వీగిపోవడంపై తామేం సంబరాలు చేసుకోవడం లేదన్నారు. శాంతిభద్రతల విషయంలో పీడీపీకి ఎంత బాధ్యత ఉందో బీజేపీకి అంతే బాధ్యత ఉందన్నారు. అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా అన్నది గవర్నర్ ఇష్టమని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు చెప్పారు.
కాగా, జమ్ము కాశ్మీర్లో 87 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్టీల బలాల విషయానికి వస్తే పీడీపీకి 28, బీజేపీకి 25, నేషనల్ కాన్ఫరెన్స్కు 15, కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు ఉన్నాయి. ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు.