కాశ్మీర్.. మరో సిరియా: అలా మారకూడదనే: రాజకీయాల్లో జోక్యం చేసుకోలేం..! ఈయూ ప్రతినిధులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తోన్న యూరోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్ల ప్రతినిధుల బృందం సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద ఛాయలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయని, వాటిని రూపు మాపడానికి భారత ప్రభుత్వం సంతృప్తికరమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను అరికట్టలేకపోతే.. మరో సిరియాలా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఉగ్రవాదులు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తారనేది సిరియాలో చూశామని, అలాంటి పరిస్థితి కాశ్మీర్ లో ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే తాము పర్యటిస్తున్నామని అన్నారు.
జమ్మూ కాశ్మీర్ కు యూరోపియన్ పార్లమెంటేరియన్ల బృందం: అసలు కథేంటీ?
తమ పర్యటనలో భాగంగా పార్లమెంటేరియన్ల బృందం ప్రతినిధులు శ్రీనగర్ లో వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రఖ్యాత పర్యాటక కేంద్రం దాల్ లేక్ లో విహరించారు. కొన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం.. ఓ విదేశీ ప్రతినిధుల బృందం ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే ప్రథమం.
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ లో మానవ హక్కులు హరించుకునిపోయాయంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. యూరోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్లు పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండో రోజు పర్యటన సందర్భంగా కొంతమంది పార్లమెంటేరియన్లు శ్రీనగర్ లో విలేకరులతో మాట్లాడారు. భారత రాజకీయాల్లో గానీ, జమ్మూ కాశ్మీర్ విషయంలో గానీ తాము జోక్యం చేసుకోవట్లేదని తేల్చి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ఎంత సున్నితమైన, సమస్యాత్మక సమస్య అనేది తమ దృష్టిలో ఉందని చెప్పారు.
ఈ సమస్యను మరింత క్లిష్టంగా మార్చడానికి తాము పర్యటించట్లేదని స్పష్టం చేశారు. కాశ్మీర్ వంటి సుందర ప్రదేశం మరో సిరియాలానో లేక ఆఫ్ఘనిస్తాన్ లాగానో మారడం తమకు ఇష్టం లేదని అన్నారు. ఉగ్రవాద ఛాయలు ఈ రాష్ట్రంలో ఉన్నాయనే విషయాన్ని తాము గమనించామని, దీన్ని నిరోధించడానికి భారత ప్రభుత్వం సంతృప్తికరమైన చర్యలు చేపట్టిందని అన్నారు. వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తాము అభిప్రాయపడుతున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదులు, వారి చర్యల వల్ల సిరియా విధ్వంసానికి ప్రతిరూపంగా నిలిచిందని అన్నారు.