చచ్చినా జేడీఎస్ తో దోస్తీ లేదు: బీజేపీ మాజీ సీఎం, ఓపిక లేదు, తండ్రీ కొడుకుల డ్రామాలు !
బెంగళూరు: జేడీఎస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలేదని, ఆ పార్టీతో తాము ఎప్పుడో విసిగిపోయామని, ఆ ఓపిక లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప అన్నారు. ఇప్పటికే తాను వందసార్లు చెప్పాను, ఇలాంటి నాయకులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని, ఒక్కసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి తండ్రీ కొడుకుల డ్రామాలతో నానా తిప్పలు పడ్డామని మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప గతం గుర్తు చేశారు.
బీజేపీ, జేడీఎస్ నాయకుల భేటీ
గురువారం రాత్రి కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ మురళీధర్ రావ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్పలతో జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి సా.రా. మహేష్ కేకే గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ, జేడీఎస్ నాయకులు భేటీ కావడంతో కర్ణాటకలో ఆ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. జేడీఎస్ నాయకులతో బీజేపీ సీనియర్ నేతలు భేటీ కావడంతో బీజేపీ హైకమాండ్ మండిపడుతోంది.
చచ్చినా దోస్తీ లేదు
చచ్చినా జేడీఎస్ తో కలిసి వెళ్లమని బీజేపీకి చెందిన మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత రేణుకాచార్య అన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యడం ముఖ్యమంత్రి కుమారస్వామికి, ఆయన కుటుంబ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య అని రేణుకాచార్య మండిపడ్డారు.
ఆకస్మిక భేటీ అంతే !
బీజేపీ నాయకులు మురళీధర్ రావ్, ఈశ్వరప్పలను జేడీఎస్ నాయకుడు సా.రా. మహేష్ ఆకస్మికంగా భేటీ అయ్యారని, అందులో ఎలాంటి ప్రత్యేకత లేదని మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప, మాజీ మంత్రి రేణుకాచార్య అన్నారు. జేడీఎస్ తో కలిసి పని చెయ్యడానికి బీజేపీ సిద్దంగా లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు.
సీఎం కుర్చీ ముఖ్యం కాదు !
ప్రస్తుతానికి బీజేపీతో కలిసి పని చెయ్యాలని తాము ఆలోచించలేదని సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి హెచ్.డి. రేవణ్ణ అన్నారు. చాముండేశ్వరి దేవి ఆశీర్వాదం సీఎం కుమారస్వామి మీద ఉన్నంతవరకు ప్రభుత్వానికి ఎలాంటి భయం లేదని అన్నారు. కుమారస్వామికి సీఎం పదవి అవసరం లేదని, అయితే ప్రజలకు కుమారస్వామి అవసరం ఉందని మంత్రి హెచ్.డి. రేవణ్ణ అంటున్నారు.
బీజేపీ హైకమాండ్ షాక్
మురళీధర్ రావ్, ఈశ్వరప్ప జేడీఎస్ నాయకుడు సా.రా. మహేష్ తో భేటీ కావడంతో బీజేపీ హైకమాండ్ అసహనం వ్యక్తం చేసిందని సమాచారం. బీజేపీ, జేడీఎస్ నాయకులు భేటీ కావడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారని తెలిసింది. జేడీఎస్ నాయకులతో భేటీ అయిన మురళీధర్ రావ్, ఈశ్వరప్పల తీరుపై అమిత్ షా, యడ్యూరప్ప మండిపడుతున్నారు.
ఏం జరుగుతోంది ?
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి చక్కటి అవకాశం వస్తున్న సమయంలో జేడీఎస్ నాయకులతో మురళీధర్ రావ్, ఈశ్వరప్ప భేటీ కావలసిన అవసరం ఏముంది ? అంటూ బీజేపీ హైకమాండ్ మండిపడుతోంది. ప్రస్తుత పరిస్థిత్తులో జేడీఎస్ నాయకులతో కలిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతోందని, ఇక ముందు అలా జరగకుండా చూడాలని బీజేపీ నాయకులకు హైకమాండ్ హెచ్చరించిందని సమాచారం.