అలా చేస్తే కరోనానే గెలుస్తుంది: లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆదేశాలపై అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కరోనావైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను తొక్కిపెట్టేస్తున్న ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ ఆదేశాలను తాము పాటిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇది రాజకీయాలు చేసేందుకు, విభేదాలకు సమయం కాదని ఆయన అన్నారు.
కరోనా సంక్షోభం: ఎన్95 మాస్కుల ధరలను 250శాతం పెంచేశారు!, పట్టని ప్రభుత్వాలు
వివాదాలకు వెళ్లాల్సిన సమయం కాదు..
కరోనా నెగిటివ్ అని తేలడంతో సెల్ఫ్ ఐసోలేషన్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఢిల్లీయేతర ప్రజలకు కూడా చికిత్స అందజేయాలన్న లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆదేశాల్ని అమలు చేస్తామని అన్నారు. దీనిపై వివాదాలకు వెళ్లాల్సిన సమయం కాదన్నారు.
అలా చేస్తే కరోనానే విజయం సాధిస్తుంది..
అయితే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల్ని అనుమతిస్తే జులై 31 నాటికి 1.5 లక్షల పడకలు అవసరం ఉంటుందన్నారు. అందరికీ చికిత్స అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కరోనాపై అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మనం మనం పోరాడుకుంటే చివరకు కరోనా విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
మరింత సవాలుగా రానున్న రోజులు..
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగనున్నాయని కేజ్రీవాల్ అన్నారు. రానున్న రోజులు మరింత సవాలుగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జులై 31 నాటికి 80వేల పడకలు అవసరమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. జూన్ 15 నాటికి 44 వేలు, జూన్ 30కి లక్ష, జులై 15 నాటికి 2.25 లక్షలు, జులై 31 నాటికి 5.5 లక్షల కేసులు నమోదు కానున్నాయని ఢిల్లీసర్కారు అంచనా వేస్తోంది.
ఢిల్లీ వాసులకే అన్న కేజ్రీవాల్.. డిల్లీయేతరులకు కూడా అంటూ ఎల్జీ
కాగా ఢిల్లీ ఆస్పత్రుల్లో ఢిల్లీ వాసులకు మాత్రమే చికిత్స అంటూ కేజ్రీవాల్ సర్కారు జారీ చేసిన ఆదేశాలను లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా బాధితులు ఢిల్లీయేతర వాసులైనా తప్పనిసరిగా చికిత్స అందజేయాలని ఢిల్లీ వైద్య శాఖకు లెఫ్ట్నెంట్ గవర్నర్ తేల్చి చెప్పారు. కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు 31,309 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,543 యాక్టివ్ కేసులున్నాయి. 11,861 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 905 మంది కరోనాతో మరణించారు.