ఇంత ఘోరమా!: సైనికులకు ఇలాంటి తిండి పెడుతున్నారా!?
పది గంటల పాటు డ్యూటీ చేసి రాత్రికి సేదతీరే సమయంలో పసుపు, ఉప్పుకలిపిన సూప్ ఇస్తున్నారని, ఖాళీ కడుపుతోనే రాత్రుళ్లు నిద్రపోవాల్సి వస్తుందని యాదవ్ తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరాక సరిహద్దులో భారత జవాన్లు శ్రమిస్తున్న తీరును పదే పదే ప్రజల ముందు ప్రస్తావించడం జరుగుతున్న సంగతి తెలిసిందే. అసలైన దేశభక్తికి వారు సైనికుల నుంచి నిర్వచనం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సైనికులు మాత్రం తమ పట్ల అధికారులు చూస్తున్న చిన్నచూపుకు ఆవేదన చెందుతున్నారు.
సైన్యం కోసం కేంద్రం కేటాయిస్తున్న నిధులను జేబుల్లో నింపుకుంటున్న అధికారులు.. నాసిరకం తిండి పెట్టి తమను క్షోభకు గురిచేస్తున్నారని జమ్మూకశ్మీర్లోని సరిహద్దు భద్రతా దళంలోని 29వ బెటాలియన్కి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తిండి విషయంలో సైనికులు ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెడుతూ ఓ వీడియో రూపంలో తమ ఆవేదనను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. మాడిపోయి అట్టకట్టపోయిన రోటీ ముక్కలు, సాంబార్, నీళ్లలాంటి టీ ఇస్తున్నారని బహదూర్ యాదవ్ అన్నారు.
పది గంటల పాటు డ్యూటీ చేసి రాత్రికి సేదతీరే సమయంలో పసుపు, ఉప్పుకలిపిన సూప్ ఇస్తున్నారని, ఖాళీ కడుపుతోనే రాత్రుళ్లు నిద్రపోవాల్సి వస్తుందని యాదవ్ తెలిపారు. జవాన్ల గురించి దేశమంతా గొప్పగా చెప్పుకుంటారని, కానీ ఇక్కడి ధీనావస్థలు అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నానని అన్నారు.
అయితే వీడియోలు కేంద్రం దృష్టికి గనుక వెళ్తే.. తనపై వేటు పడే అవకాశముందని కూడా యాదవ్ పేర్కొనడం గమనార్హం. ఇకపోతే యాదవ్ ఆవేదనను గుర్తించిన కేంద్రమంత్రి రాజ్ నాథ్.. సైనికులకు నాసిరకం తిండిపెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.