బీజేపీ కాదు, కాంగ్రెతోనే, మోడీది విశాల హృదయం: కనిమొళి, ‘జైల్లో మహాభారతం’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతోనే బంధం కొనసాగుతుందని డీఎంకే ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీతో తమకు విభేదాలున్నాయని తెలిపారు. 2జీ కుంభకోణంలో నిర్దోషిగా బయటపడిన ఆమె శుక్రవారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
తన జైలు జీవితం నుంచి రాజకీయ పొత్తులు, కరుణానిధిని కలిసిన ప్రధాని మోడీ తదితర అంశాలపై స్పందించారు. 2జీ కేసులో పటియాల హౌస్ కోర్టు కనిమొళి, ఎ రాజాతోపాటు నిందితులందర్నీ నిర్ధోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
2జీ తీర్పు: కన్నీళ్లు పెట్టుకున్న కనిమొళి, ఎ రాజాతో ఆలింగనం, ఎవరేమన్నారంటే?
మోడీది విశాల హృదయం
డీఎంకే అధినేత కరుణానిధి నివాసానికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లి.. ఢిల్లీలోని తన నివాసానికి వచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించడం ప్రధాని విశాల హృదయానికి నిదర్శనమనీ, అయితే లౌకికపార్టీ అయిన తమకు బీజేపీతో విభేదాలున్నాయనీ ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పడం గమనార్హం.
కాంగ్రెస్తోనే.. శ్రీలంక విషయంలోనే..
కాంగ్రెస్-డీఎంకే మధ్య విభేదాలకు శ్రీలంక విషయమే కారణమనీ, 2జీ మాత్రం కాదనీ కనిమొళి తేల్చి చెప్పారు. 2జీ వివాదం తర్వాత కూడా తాము కలిసే పోటీ చేశామని గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ తమ పొత్తు కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
జైల్లో ఎంతో నేర్చుకున్నా..
జైలు జీవితం నిజంగా నన్ను బలంగా, వివేకవంతంగా తీర్చిదిద్దిందని కనిమొళి తెలిపారు. రాజకీయాలు ఎలా పనిచేస్తాయో అక్కడ తెలుసుకున్నట్లు చెప్పారు.
జైల్లో మహాభారతం చదివా
జైలులో ఉన్నన్నాళ్లూ మహాభారతం చదివినట్లు, రాజకీయాల గురించి ఆ గ్రంథం తనకు ఎంతో నేర్పిందని చెప్పారు. ఎలాంటి దృక్కోణాన్ని అలవరచుకోవాలో వివరించిందని కనిమొళి తెలిపారు.