170 మంది ఎమ్మెల్యేలు మా వెంటే: ఇక మాటల్లేవ్.. రాష్ట్రపతి పాలన పెట్టమనండి చూద్దాం: శివసేన సవాల్
ముంబై: ముఖ్యమంత్రి పదవి కోసం పట్టిన పట్టు విడవట్లేదు శివసేన. మెట్టు దిగలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నాయే తప్ప ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న చిక్కుముడి వీడలేదు.. సరికదా మరింత బిగుసుకుంటోంది. శివసేన నాయకులు చేస్తోన్న ప్రకటనలు, వ్యాఖ్యానాలు బీజేపీ మధ్య దూరాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 170 మంది తమ వైపే ఉన్నారంటూ శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఈ సంఖ్య 175కు చేరుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం తమకే మద్దతు ఇస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఆపరేషన్ లోటస్ ఇక్కడ కుదరదు
ఆదివారం ఉదయం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలనే ప్రతిపాదనపై తప్ప తాము బీజేపీతో చర్చించడానికి, ఆ చర్చలను కొనసాగించడానికి మరో కారణమంటూ ఏదీ లేదని తేల్చేశారు. తాము ఇదివరకే ప్రతిపాదించిన 50-50 ఫార్ములాకు బీజేపీ అంగీకరిస్తే.. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను తమ వైపునకు లాక్కోవడానికి బీజేపీ పావులు కదుపుతోందని సంజయ్ రౌత్ విమర్శించారు.
ఇది కర్ణాటక కాదు..
ఆపరేషన్ లోటస్ పేరుతో కర్ణాటక తరహా రాజకీయాలను అనుసరించానికి బీజేపీ ప్రయత్నిస్తోందని సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలను బెదిరించో, బ్రతిమాలుకునో.. తన వైపు తిప్పుకొందని, అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేసిందని మండిపడ్డారు. యడియూరప్పను ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ అనుసరించిన వ్యూహాలు మహారాష్ట్రలో పనిచేయవని అన్నారు. ఇలాంటి కుట్రలకు బీజేపీ తెర తీస్తుందనే ఉద్దేశంతో తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.
ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్ కాల్స్..
తమ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు తమకు మద్దతు ఇష్తున్న వారికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సంజయ్ రౌత్ వెల్లడించారు. దీనికంతటికి బీజేపీయే కారణమని అన్నారు. బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఆ పార్టీకి మోకరిల్లబోమని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి బీజేపీ నాయకులు ఇప్పటికే వాంఖెడే స్టేడియాన్ని, మహాలక్ష్మి ఆడిటోరియాన్ని బుక్ చేసుకున్నారని, వారి కోరిక నెరవేరబోదని అన్నారు. ఈ సారి శివసేన నాయకుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి పాలన పెట్టే ధైర్యం ఉందా?
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను పెట్టే సాహసం బీజేపీ ప్రభుత్వం చేయకపోవచ్చని అన్నారు. అలాంటి ప్రయత్నమే చేస్తే.. దేశవ్యాప్తంగా ఆ పార్టీ బలహీనపడిపోతుందని అన్నారు. అలాంటి చర్యల వల్ల బీజేపీ దేశవ్యాప్తంగా దారుణ వ్యతిరేకతను ఎదుర్కొంటుందని, ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యుల అకాంక్షలకు వ్యతిరేకంగా బీజేపీ అడుగులు వేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదా? అని ఆయన ప్రశ్నించారు.