సర్దార్ వల్లభాయ్ పటేల్కు అంకితం: జమ్మూకశ్మీర్లో అడ్డుగా నిలిచిన గోడను తొలగించాం
గుజరాత్ : ఆర్టికల్ 370 దేశానికి జమ్మూకశ్మీర్కు ఒక తాత్కాలిక అడ్డుగోడలా నిలిచిందని ఇప్పుడు ఆ ఆర్టికల్ రద్దుతో ఓ గోడను కూల్చివేసి దేశంతో జమ్మూకశ్మీర్ను కలిపిన ఘనత తమ ప్రభుత్వానిదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశం అన్ని రాష్ట్రాలతో సమగ్రంగా ఉండాలని కలలు గన్న దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను నేడు సాకారం చేశామని మోడీ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా ప్రధాని మాట్లాడారు. అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
జమ్మూకశ్మీర్లో కొత్త రాజకీయ శఖం
జమ్ముకశ్మీర్లో కొత్త రాజకీయ శఖం ప్రారంభమైందని చెప్పిన ప్రధాని మోడీ.. ఆర్టికల్ 370 రద్దుతో అప్పటి వరకు ఉన్న అన్ని అవాంతరాలు తొలిగిపోయాయని చెప్పారు. ఇందుకు నిదర్శనం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని ప్రధాని గుర్తు చేశారు. ఇక అభివృద్ధిలో జమ్మూ కశ్మీర్ దూసుకెళుతుందని ప్రధాని మోడీ చెప్పారు. కొత్త హైవేలు, రైల్వే లైన్లు, కొత్త హాస్పిటల్స్, కొత్త కాలేజీలతో జమ్మూకశ్మీర్ మరియు లడఖ్ ప్రజలను మరో స్థాయికి తీసుకెళుతామని మోడీ వెల్లడించారు. ఆర్టికల్ 370 అమలులో ఉండటం వల్ల గత మూడు దశాబ్దాలుగా 40వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పిన ప్రధాని ఇలా ఇంకా ఎందరు ఎంతకాలం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రశ్నించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్కు అంకితం
తమ ప్రభుత్వం గోడ కూల్చిందని ఇక అభివృద్ధిని పరుగులు తీయిస్తామని చెప్పారు ప్రధాని మోడీ. తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఉండి ఉంటే జమ్మూ కశ్మీర్ను భారత్లో అప్పుడే విలీనం చేసే ఉండేవారని ప్రధాని మోడీ వల్లభాయ్ మాటలను గుర్తుచేశారు. ఆగష్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్కు అంకితం చేస్తున్నామని చెప్పారు. దేశం ఐక్యం అయినందున వేర్పాటువాదులు, ఉగ్రవాదుల కుట్రలను చేధిస్తామని చెప్పారు. ఇలాంటి వారు తమకు గతంలో జరిగిన అనుభవాలను మర్చిపోయారని చెప్పారు. భారత్ ఐక్యం కావడంతో శతృదేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మోడీ చెప్పారు.
దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు పరిష్కారం
ఈశాన్య రాష్ట్రంలో రెబెల్ నాగా గ్రూపులతో చర్చలపై కూడా ప్రధాని మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. చర్చలు విజయవంతమైతే భారత్ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈశాన్య భారతం మిగతా భారత రాష్ట్రంతో కలిగి ఉన్న సంబంధాలపై పలు సందర్భాల్లో ప్రశ్నలు తలెత్తాయని అయితే వాటన్నిటికీ సమాధానం ఇచ్చే దిశగా తమ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని చెప్పారు. కొన్న దశాబ్దాలుగా ఈ సమస్యలకు పరిష్కారం లేదని గుర్తు చేశారు ప్రధాని మోడీ. భారత్ ఏకత్వంలో భిన్నత్వం కలిగిన ఏకైక దేశం అని చెప్పిన ప్రధాని... అదే మనదేశానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పారు. దేశంలో విభిన్నమైన సంస్కృతులు, భాషలు, మతాలు ఉన్నాయని అయితే భారతీయులంతా సోదరభావంతో కలిసి జీవిస్తున్నారని చెప్పారు. ఇదే భారతీయుల గొప్పతనం అని కొనియాడారు.