నరాల్లో ప్రవహించేది భారతీయ రక్తమైతే ఎవరూ దాడులపై ప్రశ్నించరు: విపక్షాలపై మోడీ ఫైర్
పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు జరిపాక మన ప్రభుత్వం మౌనంగానే ఉన్నిందని... పాకిస్తాన్ మాత్రం ఉదయం ఐదుగంటల నుంచి ఏడచి గగ్గోలు పెట్టిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పుల్వామా దాడుల తర్వాత ఊరీలాంటి సర్జికల్ స్ట్రైక్స్ భారత్ చేస్తుందని పాక్ ఊహించిందని కానీ ఈ సారి మాత్రం యుద్ధవిమానాల ద్వారా దాడులు నిర్వహిస్తామని పాక్ ఊహించలేకపోయిందన్నారు ప్రధాని.
అగ్రిగోల్డ్ విశ్వరూపం: బినామీ పేర్లతో 700 కోట్లు కాజేసిన వైనం
ఇలాంటి దాడులు గత ప్రభుత్వాలు చేయలేకపోయాయి
ఊరి ఘటనల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ గురించి బహిర్గతం చేశామని... అయితే పుల్వామా దాడుల తర్వాత భారత్ ఏమి చేయాలో అంతా చేసిందని అయితే స్ట్రైక్స్ గురించి బయటకు చెప్పలేదని అన్నారు ప్రధాని. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే ఫిబ్రవరి 26న ఉదయం 5 గంటల నుంచే తమపై భారత్ దాడులు చేసిందంటూ ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చిందన్నారు ప్రధాని మోడీ. పాకిస్తాన్ మోడీనే దాడులు చేయించాడు, మోడీనే దాడులు చేయించాడని అరుస్తుండగా.... భారత్లో ఉంటున్న కొందరు మాత్రం పాకిస్తాన్కు తమ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా సహకరిస్తున్నారని మండిపడ్డారు. పుల్వామా దాడుల తర్వాత మన సైన్యం శత్రుదేశంపైకి వెళ్లి దాడులు చేసి వచ్చారని ఇలాంటి దాడులు కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వాలు చేయలేకపోయాయని అన్నారు.
భారత్ మాతా కీ జై అనేవారు ఎవరూ ఇలా ప్రశ్నించరు
బాలాకోట్ దాడులపై స్పష్టత కోరిన విపక్షాలపై ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోడీ. పుల్వామా దాడులకు బాధ్యత తమదే అని జైషే మహ్మద్ చెప్పిన తర్వాత కూడా చేతులు కట్టుకుని ఎలా కూర్చోవాలంటూ మోడీ అన్నారు. భారత వైమానిక దళం పాకిస్తాన్పై దాడులు చేసిందని ఆదేశం అంగీకరిస్తుండగా..... దాడులు చేసి తిరిగి భారత్కు చేరుకున్నామని ఇండియన్ ఎయిర్ఫోర్స్ చెబుతున్నప్పటికీ కూడా కొందరు ఇంకా ప్రశ్నలు అడుగుతున్నారని కాంగ్రెస్ను పరోక్షంగా టార్గెట్ చేశారు మోడీ. తమ నరాల్లో భారతీయ రక్తం ప్రవహిస్తున్నవారికెవరికీ ఇలాంటి అనుమానాలు రావని మోడీ అన్నారు.భారత్ మాతా కీ జై అని నినదించేవారు ఎవరూ ఇలాంటి ప్రశ్నలు అడగరని అన్నారు. మరి ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తే వారిని ఏమనాలని మోడీ తన ప్రసంగంలో ప్రశ్నించారు.
గత ప్రభుత్వాలు దాడుల సమయంలో హోంమంత్రిని మాత్రమే మార్చాయి
గత ప్రభుత్వాల విధానాలతోనే దేశంలో ఉగ్రవాదదాడులకు అవకాశం వస్తోందని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ కూడా భారత్ అప్పటిలా లేదని గ్రహించాయని చెప్పారు. గతంలో కూడా పాకిస్తాన్ ఉగ్రదాడులు చేసిందని కాని అప్పటి ప్రభుత్వాలు మాత్రం కేవలం హోంశాఖ మంత్రిని మార్చి చేతులు దులుపుకున్నాయని అన్నారు. అలాంటి ఉగ్రదాడులు జరిగితే హోంశాఖ మంత్రిని మార్చి చేతులు దులుపుకోమంటారా లేక ప్రతిదాడులు చేయమంటారా అని ప్రజలను మోడీ సూటిగా అడిగారు. భారత్ వ్యవహరించిన తీరుతో ఉగ్రవాదుల్లో సైతం భయం పుట్టించగలిగామని మోడీ అన్నారు. దేశాన్ని విడగొట్టాలని ప్రయత్నిస్తున్న వారిపట్ల జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉందని మోడీ అన్నారు.