సోషల్ మీడియాలో మోదీ నిప్పురాజేశాం - అంకిదాస్ సంచలన కామెంట్స్ - ఫేస్ బుక్- బీజేపీ ఉదంతంలో ట్విస్ట్
ఫేస్ బుక్ - బీజేపీ ఉదంతానికి సంబంధించి మరికొన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ ఎదుగుదలలో, నరేంద్ర మోదీ ప్రధాని కావడంలో సోషల్ మీడియా దిగ్గజ సంస్థ పాత్రను మరింతగా నిర్ధారిస్తూ ప్రఖ్యాత 'వాల్ స్ట్రీట్ జనరల్(డబ్ల్యూఎస్జే)' తాజాగా సరికొత్త విషయాలను బయటపెట్టింది. ఇండియాలో ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ హెడ్ అంకిదాస్.. మోదీని ఉద్దేశించి సంస్థ అంతర్గత గ్రూపుల్లో చేసిన కామెంట్లను, గడిచిన తొమ్మిదేళ్లలో ఆ సంస్థ బీజేపీతో ఎలా అంటకాగిందనే విషయాలను వాల్ స్ట్రీట్ తన తాజా కథనంలో రాసుకొచ్చింది. ఫేస్ బుక్ సంస్థ మాత్రం ఎప్పటిలాగే ఆరోపణల్ని ఖండిస్తూ, ''ఔట్ ఆఫ్ కాంటెక్స్'' అంశాలను హైలైట్ చేశారని మండిపడింది.
Recommended Video
కార్పొరేటర్ ను కొట్టి, కారుకు నిప్పు - ఖమ్మంలో అనూహ్య సంఘటన - అసలేం జరిగిందంటే..
నిప్పు రాజేశాం.. ఇక చరిత్రే..
వాల్ స్ట్రీట్ కథనం ప్రకారం.. 2014 లోక్ సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం సందర్భంలో ఫేస్ బుక్ ఇండియా ఉద్యోగుల గ్రూపులో సంస్థ పబ్లిక్ పాలసీ హెడ్ అంకి దాస్ కీలక కామెంట్లు పెట్టారు ‘‘సోషల్ మీడియాలో మనం మోదీ నిప్పు రాజేశాం.. ఇక జరగబోయేదంతా చరిత్ర..'' అని ఆమె రాశారని, 2012-2014 మధ్య ఇలాంటివే మరికొన్ని ప్రో బీజేపీ కామెంట్లనూ పోస్ట్ చేశారని వెల్లడైంది. సదరు గ్రూప్ లో ఫేస్ బుక్ ఉద్యోగులు మాత్రమే సభ్యులుగా ఉంటారని, సంస్థ అన్ని శాఖలకూ దాన్లోకి యాక్సెస్ ఉండటంతో నాటి కామెంట్లను సేకరించగలిగామని వాల్ స్ట్రీట్ పేర్కొంది.
గుజరాత్ ప్రచారం సక్సెస్..
2011లో అంకిదాస్ ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ(ఇండియా) హెడ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రో బీజేపీ యాక్టివిటీలు పెరిగాయని, 2012లో మోదీ గుజరాత్ సీఎంగా తిరిగి ఎన్నికైన సందర్భంలో ‘‘మన గుజరాత్ క్యాంపెయిన్ సూపర్ సక్సెస్''అని దాస్.. ఉద్యోగుల గ్రూప్ లో కామెంట్ పెట్టారని వాల్ స్ట్రీట్ పేర్కొంది. మోదీ ప్రధాని అభ్యర్థిగా సన్నాహాలు చేసుకుంటోన్న రోజుల్లో ఫేస్ బుక్ ఉద్యోగుల మధ్య గ్రూప్ లో ఆసక్తికర సంబాషణలు జరిగేవని, ‘‘మోదీ కంటే కాంగ్రెస్ కు ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు కదా?''అని ఓ ఉద్యోగి ప్రశ్నించగా.. ‘‘కాంగ్రెస్ తో పోలిక పెట్టి ఆయన స్థాయిని తగ్గించకండి..''అని అంకిదాస్ రిప్లై ఇచ్చినట్లుగా వాల్ స్ట్రీట్ తన కథనంలో రాసింది.
బీజేపీకి ఫేస్ బుక్ ట్రైనింగ్..
2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ-ఫేస్ బుక్ బంధం మరింత బలపడిందని, ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రమోట్ చేయడం, పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి(సోషల్ మీడియా వినియోగదారుల్లోకి) మరింత సమర్థవంతంగా ఎలా తీసుకెళ్లాలో ఫేస్ బుక్ ప్రతినిధులు దగ్గరుండిమరీ బీజేపీ శ్రేణులకు ట్రైనింగ్ ఇచ్చారని వాల్ స్ట్రీట్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు, ఎన్నికల వ్యవహారాల పరిశీలన కోసం ఫేస్ బుక్ నియమించుకున్న ‘కెయిత్ హర్బాత్' అనే అధికారితో అంకిదాస్ కు మంచి సంబంధాలున్నాయని, కెయిత్ సహకారంతోనే ఆమె ఇండియాలో తన ‘ప్రో బీజేపీ' వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయగలిగిందని వాల్ స్ట్రీట్ కథనంలో రాశారు. కెయిత్ తో సంబాషణల్లో దాస్.. మోదీని ఇండియన్ జార్జ్ బుష్ గా అభివర్ణించేవారనీ వెల్లడైంది.
బీజేపీతో బంధంపై ఫేస్ బుక్ వివరణ
ఇండియాలో ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ దారి తప్పిందని, విద్వేష వ్యాఖ్యలను తొలగించే విషయంలో బీజేపీ నేతలకు మినహాయింపు ఇచ్చారంటూ వాల్ స్ట్రీట్ జనరల్ ఆగస్టు రెండో వారంలో తన మొదటి కథనాన్ని ప్రచురించింది. దానికి కొనసాగింపుగా ఆదివారం(ఆగస్టు 30)న మరో కథనాన్ని రాసింది. బీజేపీతో లింకులున్న కంపెనీల నుంచి ఫేస్ బుక్ కు భారీగా నిధులు సమకూరాయని, ఆ ప్రచారకర్తల పేర్లను వెల్లడించకుండా ఫేస్ బుక్ తన తప్పుల్ని కప్పిపుచ్చుకుందని వాల్ స్ట్రీట్ తాజా కథనంలో రాశారు. కాగా, తాము ఏ దేశంలోనూ ఏ రాజకీయపార్టీకీ అనుకూలంగా పనిచేయడంలేదని గతంలోనే స్పష్టం చేసిన ఫేస్ బుక్ సంస్థ.. తాజా అంశాలపైనా వివరణ ఇచ్చింది. నిధుల అంశంలో ఆరోపణల్ని కొట్టిపారేసింది. అయితే, అంకిదాస్ కామెంట్ల విషయంలో మాత్రం వాల్ స్ట్రీట్ జనరల్ తప్పుగా, ‘ఔట్ ఆఫ్ కాంటెక్స్'లో తీసుకుని రాశారని మండిపడింది.
మహిళ గొంతులో 4 అడుగుల పాము - నోరు తెరిచి నిద్రపోతే అంతే మరి - వైరల్ వీడియో