ఉగ్రవాదం అంతమయ్యే సమస్య కాదు..అమెరికా తరహాలో దాడులు చేయాలి: బిపిన్ రావత్
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరు ఎప్పటికీ ఆగదని పునరుద్ఘాటించారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్. ఉగ్రవాదంపై పోరు ఆగాలంటే ముందు ఆ మూలాలను అంతమొందించాలని అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన జనరల్ బిపిన్ రావత్ ఉగ్రవాదం అనేది అంతమొందే ప్రక్రియ కాదన్నారు. దానితో పాటుగానే ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పిన రావత్, ముందుగా ఉగ్రవాదం మూలాలను పెకిలించాలని చెప్పారు. పాకిస్తాన్ను ప్రపంచ దేశాలు ఒంటరిని చేయాలని ఈ సందర్భంగా రావత్ పిలుపునిచ్చారు.
9/11 అమెరికా దాడుల తర్వాత ఆదేశం ఉగ్రవాదంపై ఎలాగైతే పోరు చేస్తోందో ఆ తరహా పోరాటాన్ని భారత్ కూడాఇంప్లిమెంట్ చేయాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి నిధులు సమకూర్చే దేశాలు ఉన్నంతవరకు ఆ ఉగ్రభూతం ఉండనే ఉంటుందన్నారు రావత్.
ఉగ్రవాదులకు ఆయుధాలు సమకూర్చడం, నిధులు సమకూర్చడం ఉన్నంత వరకు ఉగ్రవాదంను పూర్తిస్థాయిలో నియంత్రించలేమని ఒక్క పోరాటం ద్వారానే కాస్త కంట్రోల్ చేయొచ్చని చెప్పారు. ఉగ్రవాదంపై డేగకన్నుతో వ్యవహరిస్తున్న అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాక్స్ ఫోర్స్ను కొనియాడారు. ఆ సంస్థ బాగా పనిచేస్తోందని చెప్పారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే క్రమంలో నిధులు సమకూరుస్తున్న ఆయా దేశాలపై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కమిటీ కఠినంగా వ్యవహరించాల్సి ఉందని జనరల్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. ఆ దేశాలను బ్లాక్లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే ఉగ్రవాదంను కొంతవరకు కంట్రోల్ చేయొచ్చని చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు ఉండకూడదని రావత్ చెప్పారు. ఇక పాకిస్తాన్ తీరును కూడా ఆయన తప్పుబట్టారు. పాక్ ఉగ్రవాదులకు పూర్తిస్థాయిలో అండగా నిలుస్తోందన్నారు. భారత్లో దాడులకు పాల్పడితే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని బిపిన్ రావత్ హెచ్చరించారు.