మతాల జనసంఖ్య తీవ్రం - జనాభా నియంత్రణ అవసరం: హిందూపై తేల్చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్
ముంబై: ప్రతి సంవత్సరం విజయదశమి రోజున ప్రత్యేక సమావేశాలు, శిబిరాలను నిర్వహిస్తూ వస్తోన్న ఆనవాయితీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కొనసాగించింది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో విజయదశమి వేడుకలను ఆర్ఎస్ఎస్ భారీ ఎత్తున నిర్వహించింది. విమెన్ మౌంటెనీర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సంతోష్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1992, 1993లో రెండుసార్లు ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఓ మహిళ- ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలకు చీఫ్ గెస్ట్గా హాజరు కావడం ఇదే తొలిసారి.
మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ మాట్లాడారు. దేశంలో మతపరమైన అసమానతలు భారీగా పెరిగిపోయాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జనాభా పెరిగిపోవడం వల్లే మతపరమైన సమతౌల్యం దెబ్బతిన్నదని, దీన్ని నియంత్రణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. దీనికోసం జనాభా నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు.
అలాంటి వారిని అడ్డుకోవాల్సిందే..
స్వార్థం, ద్వేషం ప్రాతిపదికన సమాజంలోని వివిధ వర్గాల మధ్య దూరాన్ని, శత్రుత్వాన్ని సృష్టించే చర్యలు యథేచ్ఛగా సాగుతున్నాయని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. భాష, మతం, ప్రాంతం, విధానంతో సంబంధం లేకుండా, వారు చేసే ఉపన్యాసాల మాయాజాలంలో చిక్కుకోకూడదని అన్నారు. మనుషుల మధ్య శతృత్వాన్ని పెంచే వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాల్సి ఉందని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.
జనాభా అసమతులత్య
దేశంలో జనాభా అసమతుల్యత ఏర్పడినప్పుడు భౌగోళిక సరిహద్దులు సైతం మారిపోతాయని మోహన్ భగవత్ అన్నారు. జననాల రేటులో అసమానత సరికాదని తేల్చి చెప్పారు. దేశంలో బలవంతపు మతమార్పిడి, చొరబాటుకు కూడా ప్రధాన కారణాలుగా అవుతున్నాయని వ్యాఖ్యానించారు. అన్ని విషయాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకొని జనాభా విధానాన్ని రూపొందించాలని, దీన్ని అందరికీ సమానంగా వర్తింపజేయాలని చెప్పారు.
హిందూ పదానికి ప్రత్యామ్నయం లేదు..
జనాభా పెరుగుదల, మతపరమైన అసమతౌల్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని, అప్పుడే జనాభా నియంత్రణ నియమాలు ఫలిస్తాయని మోహన్ భగవత్ చెప్పారు. హిందూ రాష్ట్ర భావనపై సర్వత్రా చర్చ జరుగుతోందని, చాలామంది దీన్ని అంగీకరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. హిందూ అనే పదానికి కొందరు దూరంగా ఉంటోన్నారని, దీనికి బదులుగా వేరే పదాన్ని ఉపయోగించాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
తప్పు జరుగుతుంటే ప్రశ్నించండి కానీ..
ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన వారి సంఖ్య పెరగాలని, అది చట్టానికి లోబడి ఉండాలని మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వల్ల మైనారిటీలకు ప్రమాదం పొంచి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారని, అది సరైంది కాదని ఆయన తేల్చిచెప్పారు. దాడులకు పాల్పడటం ఆర్ఎస్ఎస్ లేదా హిందువుల స్వభావం కాదని వివరించారు. సోదరభావం, సౌభ్రాతృత్వం, శాంతియుత వాతావరణాన్ని ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ సమర్థిస్తుందని అన్నారు.