శివసేనపై అమిత్ షా నిప్పులు.. అధికార దాహంతోనే, సీఎం, 50-50పై హామీ ఇవ్వలేదని వెల్లడి
శివసేనపై బీజేపీ చీఫ్ అమిత్ షా నిప్పులు చెరిగారు. అధికార దాహంతోనే ఆ పార్టీ కాంగ్రెస్-ఎన్సీపీతో చేతులు కలిపిందని దుయ్యబట్టారు. బుధవారం ట్విట్టర్లో శివసేన వైఖరిని ఎండగడుతూ వరస ట్వీట్లు చేశారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి ప్రణాళిక లేదని.. పదవే వారికి ముఖ్యమని మండిపడ్డారు. అంతేకాదు ఎన్నికలకు ముందు తాము పదవులపై శివసేనకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని చెప్పారు.
శివసేన సారథ్యంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు ప్రక్రియ షురూ: ఉదయం 8 గంటలకు అసెంబ్లీ స్పెషల్ సెషన్
చెప్పలేదే..?
శివసేన అభ్యర్థికి సీఎం పదవీ ఇస్తామని చెప్పలేదన్నారు అమిత్ షా. 50-50 ఫార్ములా గురించి చర్చించలేదన్నారు. మహారాష్ట్ర ప్రజల అభిమతాన్ని శివసేన తిరస్కరించిందని దుయ్యబట్టారు. ప్రజలు బీజేపీ-శివసేనకు అధికారం కట్టబెడితే.. ఉద్దవ్ మాత్రం అధికారమే పరామావధిగా భావించారని విమర్శించారు. శివసేన తన సిద్ధాంతాన్ని మరచిపోయిందని మండిపడ్డారు.
విలువలేవీ..?
ఆ మూడు పార్టీలు అన్నీ విలువలకు పాతరేసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో శివసేన నేతలు ఉద్దవ్ థాకరే, ఆదిత్య థాకరే తమతో స్టేజీపై ప్రచారం చేసిన సమయంలో కూడా వారికి సీఎం పదవీ ఇస్తామని చెప్పలేదని అమిత్ షా స్పష్టంచేశారు. మహారాష్ట్రలో తమ సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్పినట్టు ఉద్ఘాటించారు.
ఆ సీట్లు మోడీ వల్లే
తమతో శివసేన భాగస్వామ్యంతో పోటీ చేయడం వల్లే ఆ మాత్రం సీట్లు సాధించగలిగిందని చెప్పారు. మోడీ జీ బొమ్మతో కూడా శివసేన అభ్యర్థులకు పట్టం కట్టారనే విషయాన్ని అమిత్ షా గుర్తుచేశారు. బహిరంగ సభల్లో మోడీ జీ ఫోటో పెట్టుకోలేదా ? ప్రచార పర్వాన్ని మహారాష్ట్రీయులు చూడలేదా ? దేశం గమనించలేదా అని అమిత్ షా ప్రశ్నించారు.
శివసేన అభ్యర్థికే ఎందుకు..?
కాంగ్రెస్-ఎన్సీపీకి 100 సీట్లు ఉన్నాయని అమిత్ షా గుర్తుచేశారు. ఆ రెండు పార్టీల అభ్యర్థి సీఎం పదవీ చేపట్టాలి కదా అని ప్రశ్నించారు. 56 ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రి పదవీ చేపట్టడం ఏంటి అని నిలదీశారు. ఇదే అంశాన్ని సోనియాగాంధీ, శరద్ పవార్ను అమిత్ షా అడిగారు. మీ అభ్యర్థి సీఎం పదవీ చేపట్టాలి కదా.. శివసేన క్యాండెట్ చేపట్టడంలో ఆంతర్యం ఏంటి అని కొశ్చన్ చేశారు. ఇదీ శివసేన అధికార దాహనికి అద్దం పడుతుందని చెప్పారు.