మోడీ ముందు ఇందిరా రికార్డ్ తుత్తునియలు! ప్రధాని భావోద్వేగ ప్రసంగం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం భావోద్వేగానికి లోనయ్యారు. తాజాగా గుజరాత్, హిమాచల్ రాష్ట్రాలలో గెలుపుతో బీజేపీ దేశంలోని 29 రాష్ట్రాలలో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లయింది. పార్లమెంటరీ భేటీలో ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.
బీజేపీ విజయ ప్రస్థానంపై ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో విజయాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద విజయమని చెప్పారు. 19 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నామని చెప్పారు. ఇందిరా గాంధీ హయాంలో కూడా 18 రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉందని చెప్పారు.
1894 నుంచి విజయాలు మరువలేనివి
1984 నుంచి 2017 వరకు బీజేపీ విజయ ప్రస్థానంలో సాధించిన విజయాలు మరువలేనివి అని మోడీ అన్నారు. అయితే సాధించిన విజయాలతో ఊరుకోవద్దన్నారు. 2018లో వరుసగా ఎన్నికలు ఉన్నాయని గుర్తు చేశారు.
ప్రజలు నా నుంచి ఎంత ఆశిస్తే అంత చేస్తా
అధికారం సాధించడం ప్రజల కోసమేనని మోడీ చెప్పారు. వారికి మేలు చేయడానికే అన్నారు. తన నుంచి ఇంకా ఎంత పని ఆశిస్తున్నారో అదంతా చేసి చూపెడతానని చెప్పారు. ఎన్నికల ఫలితాలతో మనం ఉప్పొంగి పోవద్దని చెప్పారు. అంతకుముందు ఆన పార్టీ నేతలందరికీ నమస్కరించి మాట్లాడారు.
ట్విట్టర్లో గుజరాత్ ఎన్నికలు ట్రెండ్
కాగా, గుజరాత్ ఎన్నికల గురించి దాదాపు 1.9 మిలియన్ల ట్వీట్లలో ప్రస్తావన వచ్చినట్లు ట్విట్టర్ వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి 18 మధ్య ట్విట్టర్లో ట్రెండ్ అయిన అంశాల అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. అలాగే కాంగ్రెస్ వారు ప్రచారాయుధాలుగా ఎంచుకున్న జీఎస్టీ, నోట్లర ద్దు, హిందుత్వం వంటి అంశాలు కూడా ట్రెండ్ అయ్యాయి.
వ్యక్తులుగా వీరు
వ్యక్తుల విషయానికి వస్తే గుజరాత్ ఎన్నికల సందర్భంగా ట్రెండ్ అయిన వారిలో ప్రధాని మోడీ మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో రాహుల్ ఉన్నారు. మూడో స్థానంలో పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్, నాలుగో స్థానంలో బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ఉన్నట్లు తెలిపింది. వీరితో పాటు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, దళితుల నాయకుడు జిగ్నేశ్ మేవానీ, ఓబీసీ నాయకుడు అల్పేశ్ ఠాకూర్లు ఉన్నారు.
అభివృద్ధిపై చర్చ
గుజరాత్ అభివృద్ధి అనే అంశం గురించి ట్విట్టర్లో ఎక్కువ చర్చ జరిగినట్లు పేర్కొంది. గుజరాత్ ఎన్నికల కోసం ట్విట్టర్ మొదటిసారిగా లైవ్ స్ట్రీమింగ్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రచారంలో భాగంగా చాలామంది నాయకులు ట్విట్టర్ను వారధిగా చేసుకున్నారని, దాదాపు వారు చేసిన ట్వీట్లన్నీ హిందీ భాషలోనే ఉన్నాయని తెలిపింది.