దేశ ప్రయోజనాలే ముఖ్యం: ఎన్ని ఒత్తిళ్లొచ్చినా లెక్క చేయమంటూ మోడీ
వారణాసి: దేశ ప్రయోజనాల విషయంలో ఎన్ని ఒత్తిడిలు ఎదురైనా వెనక్కితగ్గబోమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ తానుప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
దేశ ప్రయోజనాల కోసమే ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోడీ చెప్పారు. ఆ విషయంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తాము తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామన్నారు.
Recommended Video
భారత 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అత్యాధునిక సాంకేతికతతో వారణాసితోపాటు అన్ని దర్శనీయ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని వివరించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ వేగంగా పనిచేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు.
పర్యటనలో భాగంగా దాదాపు రూ. 1254 కోట్ల వ్యయంతో ఇక్కడ చేపట్టనున్న 50 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత జంగంవాడీ మఠానికి వెళ్లి ప్రధాని మోడీ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీజగద్గురు విశ్వరాధ్య గురుకుల్ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. 19 భాషల్లోకి అనువదించిన శ్రీ సిద్ధాంత్ శిఖామణి గ్రంథాన్ని, మొబైల్ యాప్ను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం భారతీయ జనసంహ్ నాయకుడు పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన జాతికి అంకితం చేశారు. 63 అడుగుల దీన్దయాళ్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
ఆ తర్వాత మూడు జ్యోతిర్లింగాలను తాకుతూ ప్రయాణించనున్న ఐఆర్టీసీ తొలి ప్రైవేటు రైలు 'మహా కాళ్ ఎక్స్ప్రెస్'ను వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. కాగా, ఈ రైలు యూపీలోని వారణాసి, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ, ఓంకారేశ్వర్లను కలుపుతూ ప్రయాణిస్తుంది. పర్యటనలో భాగంగా మోడీ వారణాసిలో 430 పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించారు.