Midhun Reddy: మరోసారి బీజేపీ వైపు మొగ్గు చూపిన వైసీపీ: లోక్ సభ వేదికగా.. మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి వైపు అడుగులు వేస్తోందా? ఏ మాత్రం అవకాశం దొరికినా, ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా చేరడం ఖాయంగా కనిపిస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది కొద్దిరోజులుగా. బీజేపీలో చేరడానికి వైఎస్ఆర్సీపీ సానుకూలంగా ఉందంటూ సంకేతాలు వెలువడుతున్న ప్రస్తుతం తరుణంలో.. ఆ పార్టీ మరోసారి అలాంటి వైఖరినే ప్రదర్శించింది లోక్ సభ వేదికగా. పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
పౌరసత్వ సవరణ బిల్లుపై వైసీపీ సానుకూలం
అత్యంత వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లుపై తన వైఖరిని స్పష్టం చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ సభాపక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం లోక్ సభలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై వాడివేడిగా చర్చ కొనసాగింది. అన్ని పార్టీల సభ్యులు దీనిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
బిల్లుకు మద్దతు ఇస్తున్నాం.. కానీ..
ఈ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. తాము బిల్లుకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. కొన్ని అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయని, వాటిపై తాము లిఖితపూరకంగా వినతిప్రతాన్ని అందజేస్తామని అన్నారు. ఆయా వివాదాస్పద అంశాలపై సానుకూలంగా వ్యవహరించాలని ఆయన అధికార పార్టీకి విజ్ఞప్తి చేశారు. పౌరసత్వ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేయడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. ముస్లింలకు సంతృప్తి పరిచేలా బిల్లులో మార్పులు చేయాలని మిథున్ రెడ్డి కేంద్రానికి సూచించారు.