వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుః 25 శాతమైనా: ప్రతిపక్షాలుః కుదరదన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంపై నెలకొన్న వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెర దించింది. 50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కుదరదని ప్రధాన న్యాయమూర్తి జస్లిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. తెలుగుదేశం పార్టీ సహా దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను కొట్టేసింది. కనీసం 25 శాతం మేరకైనా స్లిప్పులను లెక్కించాలని ప్రతిపక్ష తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రతి నియోజకవర్గంలో అయిదు ఈవీఎంలను లెక్కిస్తే సరిపోతుందని గతంలో సుప్రీంకోర్టే ఇచ్చిన తీర్పును సమర్థించుకుంది.
చంద్రబాబు సహా 21 ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు హైఓల్టేజ్ షాక్: నిమిషాల్లో కొట్టేసిన బెంచ్
25 శాతమైనా లెక్కించాలని కోరాం: మను సింఘ్వి
రివ్యూ పిటీషన్ను కొట్టేసిన అనంతరం అభిషేక్ మను సింఘ్వి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ పొలిట్బ్యురో సభ్యుడు డీ రాజాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 50 శాతం కాకపోయినా, కనీసం 25 శాతం మేరకైనా వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని తాము సుప్రీంకోర్టును కోరామని, అయినప్పటికీ.. ధర్మాసనం దీన్ని అంగీకరించలేదని అన్నారు. దీనివల్ల ప్రతిపక్షాల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డామని అన్నారు. దీన్ని సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆయన వివరించారు. అయిదు ఈవీఎంలను లెక్కించడానికి తాము ఇదివరకే అనుమతి ఇచ్చామని, ఈ దిశగా కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ఇదివరకు తాము ఇచ్చిన ఆదేశాల్లో మార్పులు చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసిందని మను సింఘ్వి చెప్పారు.
రెండు శాతం కూడా ఉండదు:
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక్కో నియోజకవర్గంలో అయిదు ఈవీఎంల ద్వారా వెలువడిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిం చడం వల్ల ఉపయోగం ఉండదని తాము సుప్రీంకోర్టుకు వివరించినట్లు మను సింఘ్వి తెలిపారు. సుప్రీంకోర్టు లెక్కల ప్రకారం చూస్తే- పోల్ అయిన ఓట్ల శాతంలో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కనీసం రెండు శాతం కూడా ఉండదని, ఈ సంఖ్య కేవలం 1.66 శాతమే ఉంటుందనే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.