వలసజీవుల కన్నీటి వేదన: 600 కి.మీలు నడిచిన మూడు కుటుంబాలు, తాగు నీరు లేక..
ఛండీగఢ్: దేశంలో కరోనా లాక్డౌన్ కారణంగా వలస కూలీలు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ పలువురు వలస కార్మికులు సరైన సమాచారం లేక రోడ్డు మార్గంలో కాలినడకన తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు.
600 కి.మీ నడక..
రాజస్థాన్ జైసల్మీర్ నుంచి పంజాబ్ ముక్తసర్కు కాలినడకన చేరుకున్న సుఖ్దేవ్ తన ఆవేదనను పంచుకున్నారు. తమతోపాటు మూడు కుటుంబాలకు చెందిన వ్యక్తులు 9 రోజులపాటు నడిచి తమ సొంత గ్రామాలకు చేరుకున్నామని తెలిపారు. కొంత దూరం ఎడారి ప్రాంతంలో కూడా నడిచినట్లు తెలిపారు. మొత్తంగా 600 కిలోమీటర్లు నడిచి తమ గమ్య స్థానాలు చేరుకున్నట్లు సుఖ్దేవ్ తెలిపాడు. ఏప్రిల్ 16న కాలినడకన రాజస్థాన్ నుంచి ప్రయాణం మొదలు పెట్టగా ఏప్రిల్ 25న ఇంటికి చేరుకున్నట్లు సుఖ్దేవ్ వెల్లడించాడు. ఆ తర్వాత 21 రోజులపాటు హోం ఐసోలేషన్లో ఉన్నామని తెలిపారు.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎడారిలో..
ప్రతి సంవత్సరం లాగే వ్యవసాయ పనుల నిమిత్తం ముక్తసర్ నుంచి జైసల్మేర్ వెళ్లామని, అయితే, లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో తిరిగి తాము వెనక్కి రావాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే, తమ నడక ప్రయాణంలో నరకం చూశామని సుఖ్ దేవ్ వెల్లడించాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తాము ఎడారుల గుండా ప్రయాణం చేశామని చెప్పాడు. సుతార్ మండి నుంచి తమ గ్రామానికి సుమారు 602 కిలోమీటర్ల దూరం ఉందని, కాలికనడకనే అంత దూరం ప్రయాణించామని తెలిపాడు.
తాగునీరు కూడా ఇవ్వలేదు..
తమ ప్రయాణం చాలా కష్టతరంగా సాగిందన్నారు. తమ ప్రయాణంలో తమకు ఎవరూ తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని, కలుషితం అవుతాయంటూ కాలువలో నీరు తాగేందుకు కూడా కొందరు అనుమతించలేదని వాపోయాడు. దీంతో మహిళలు, పిల్లలు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గురుదేవ్ సింగ్ తన భార్య నసీబ్, ఆరేళ్ల కూతురును తీసుకుని ప్రయాణించాడు. చెట్టు కింద కూర్చుని సేద తీరేందుకు కూడా కొన్ని గ్రామాల ప్రజలు అనుమతించలేదని గురుదేవ్ సింగ్ వాపోయాడు. వీర్పల్ కౌర్ అనే గర్బిణీ కూడా ఈ ప్రయాణం చేశారు. మరో కుటుంబం తమ 3 నెలల కూతురుతో ఈ ప్రయాణం సాగించింది.
Recommended Video
తాగునీరు లేక ఓ వ్యక్తి మరణించాడు. ఎవరూ సాయం చేయలే..
తమ ప్రయాణంలో చాలా మంది తమ లాగే కాలినడకన సొంత గ్రామాలకు వెళుతున్నవారిని చూసినట్లు తెలిపాడు సుఖ్ దేవ్. తాగు నీరు దొరక్కపోవడంతో ఓ వ్యక్తి మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడని ఆయన వాపోయాడు. అయితే, వారు ఎలా గమ్యస్థానాలు చేరుకున్నారో తెలియదన్నాడు. తాము పిండి, శనగలు, పాల పౌడర్ లాంటివి వెంట తీసుకెళ్లామని, మార్గమధ్యలో వంట చేసుకుని తిన్నామని, పిల్లలకు మిల్క్ పౌడర్తో పాలు చేసి పట్టిచ్చామని చెప్పారు. తాము పిల్లలతో ప్రయాణం సాగిస్తున్నప్పటికీ ఎవరూ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చివరకు తాము తమ ఇంటికి చేరుకున్నామని సుఖ్ దేవ్ తెలిపాడు. తమ లాంటి అనేక మందిని ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన కోరారు.